Share News

నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు

ABN , Publish Date - May 06 , 2025 | 12:13 AM

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అంశాలపై వివరించారు.

నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు

పెద్దపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అంశాలపై వివరించారు.

భూభారతి: నూతన ఆర్వోఆర్‌ చట్టంపై సుల్త్తానాబాద్‌ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో ఈనెల 5 నుంచి 19 వరకు ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, దరఖాస్త్తులను జూన్‌ 2 వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాల సమస్యలు మినహాయించి మిగిలిన వాటిని భూ భారతి చట్టం వినియోగించి పరిష్కరిస్తామన్నారు. రోజు రెవెన్యూ సదస్సులో ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో సమగ్ర రికార్డు నిర్వహిస్తున్నామని, ఆర్‌ఎస్‌ఆర్‌, అసైన్మెంట్‌ సమస్యలు, సాదాబైనామా దరఖాస్తులు వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

రాజీవ్‌ యువ వికాసం: జిల్లాలో మొత్తం 47 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం కొంత మేర సబ్సిడీ, బ్యాంకు లింకేజీ కలిపి యువ వికాసం యూనిట్‌ గ్రౌండ్‌ చేయాల్సి ఉంటుందని, ఎన్‌.పి.ఏ ఉన్న దరఖాస్తుదారులు, సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్న, ఐదు సంవత్సరాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి యూనిట్లు పొందిన దరఖాస్తులను మినహాయిస్త్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి చేస్తామని, రాష్ట్రం నుంచి జిల్లాకు యువ వికాసం నిధుల కేటాయింపు జరగగానే మండలాల వారీగా కేటాయింపులు చేసి అర్హుల తుది జాబితా తయారు చేస్తామన్నారు.

ధాన్యం కొనుగోలు : యాసంగి సీజన్‌లో జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 13 వేల 573 రైతుల నుంచి 240 కోట్ల విలువ చేసే లక్ష వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 154 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించామని కలెక్టర్‌ తెలిపారు. సన్న రకం ధాన్యం కొనుగోలులో ఉన్న సమస్యలను పరిష్కరించామని, ఇప్పటివరకు ఐదువేల మెట్రిక్‌ టన్నుల సన్నరకం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో ఎటువంటి డిఫాల్ట్‌ లేని 105 రైస్‌మిల్లులకు ముందుగా ధాన్యం కేటాయింపులు చేశామని, రైస్‌మిల్లర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చూస్తున్నామన్నారు. నాణ్యత ప్రమాణాలు ఉన్న చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, అవసరమైన హమాలీలను బీహార్‌ నుంచి రప్పించామన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు : జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో 1940 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 700 ఇండ్లు గ్రౌండ్‌ చేశామని, బేస్మెంట్‌ వరకు పూర్తి చేసుకున్న 150 ఇండ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, ప్రతీ సోమవారం నిర్మాణ పనుల పురోగతి ప్రకారం నిధులు విడుదల అవుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు జిల్లాలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున (పైలెట్‌ ప్రాజెక్టులో మంజూరు చేసిన మినహాయించి) లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసి అందించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు మరోసారి వెరిఫై చేస్తున్నారని తెలిపారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో మంజూరు పత్రాలు పంపిణీ చేసి గ్రౌండ్‌ చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు ఎక్కడైనా అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే వాటిని రద్దు చేసే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పర్యవేక్షించేందుకు ప్రతీ మండలానికి ప్రభుత్వం అసిస్టెంట్‌ ఇంజనీరు కేటాయిస్తుందని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 12:13 AM