ఐఏఎస్ల పాలనలోనూ నకిలీ బిల్లులు
ABN , Publish Date - May 12 , 2025 | 12:40 AM
నకిలీ బిల్లులు, పనులు, కుంభకోణాలకు పెట్టింది పేరు రామగుండం నగరపాలక సంస్థ... గతంలో రోడ్డు వేయకుండానే వేసినట్టు బిల్లులు దండుకున్న చరిత్ర కార్పొరేషన్ది. కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు బిల్లులు రికార్డు చేసుకున్నారు. కాలువల పూడికతీత మొదలు, అంతిమ సంస్కారాల వరకు దేనిని వదలకుండా అందినంత దండుకున్నారు.
కోల్సిటీ, మే 11(ఆంధ్రజ్యోతి): నకిలీ బిల్లులు, పనులు, కుంభకోణాలకు పెట్టింది పేరు రామగుండం నగరపాలక సంస్థ... గతంలో రోడ్డు వేయకుండానే వేసినట్టు బిల్లులు దండుకున్న చరిత్ర కార్పొరేషన్ది. కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు బిల్లులు రికార్డు చేసుకున్నారు. కాలువల పూడికతీత మొదలు, అంతిమ సంస్కారాల వరకు దేనిని వదలకుండా అందినంత దండుకున్నారు. వాహనాలు రాకుండానే కోట్ల రూపాయల ఓచర్ బిల్లులు ఇచ్చి కుంభకోణాలకు పాల్పడ్డారు. మూలనపడిన వాహనాలకు డీజిల్ రాసుకుని లక్షలు దండుకున్నారు.
కార్పొరేషన్లో ప్రస్తుతం ఇద్దరు ఐఏఎస్ల ఆధ్వ ర్యంలో పాలన సాగుతుంది. అవకతవకలకు, అవినీతికి అవకాశం లేకుండా పాలనను గాడిన పెడుతున్నారని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇంజనీరింగ్ విభాగం లో జరుగుతున్న అవినీతి మరోమారు పాలనలోని డొల్లతనాన్ని బయట పెడుతుంది. కార్పొరేషన్లో రూ.3కోట్ల నామినేషన్ పనుల బిల్లులను రెండు సార్లు కార్పొరేషన్ పాలకవర్గం తిరస్కరించింది. అయినప్పటికీ చాలా ఫైళ్లు ఇప్పటికే బిల్లులకు ఎక్కాయి. తాజాగా రెండేళ్ల క్రితం అధికారులు తిరస్కరించి మూలన పడవేసిన ఒక ఫైల్కు ఇటీవల పాత తేదీల్లో రికార్డు చేసి బిల్లుకు సిఫార్సు చేసిన ఉదంతం ఇప్పుడు కార్పొరేషన్లో చర్చనీయాంశమైంది. కార్పొరేషన్ పరి ధిలో నిర్మాణ వ్యర్థాల తొలగింపు, ఇతర పనుల పేర 2022లో రూ.30లక్షలు మంజూరు చేశారు. ఈ పను లను ఒక సొసైటీ కాంట్రాక్టు పొందింది. తరువాత సదరు కాంట్రాక్టర్ మరణించాడు. సొసైటీ సభ్యులకు సమాచారం లేకుండానే బిల్లులు రికార్డు కావడంతో కొంత వివాదం నెలకొన్నది. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఫైళ్లు పక్కకు పడవేశారు. ఏ ఇంజనీర్ పనులు చేయించాడు, ఏ ఇంజనీర్ చెక్ మెజర్ చేశా డనే విషయంలో వివాదాలు చెలరేగాయి. ఎవరికి వారుగా సంబంధాలు లేవంటే తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ ఫైల్ బిల్లుకు సిఫార్సు అయినట్టు కార్పొరేషన్లో చర్చ జరుగుతుంది.
ఆసుపత్రి పనుల్లోనూ గోల్మాల్...
గోదావరిఖని పట్టణంలో ఒక ఆసుపత్రి భవన నిర్మాణ పనుల రికార్డుల్లో కూడా గోల్మాల్ జరిగినట్టు తెలుస్తుంది. వాస్తవానికి సైట్ కండీషన్ను బట్టి ఇంజనీర్లు అంచనాలు తయారు చేసి భవన నిర్మాణాల విషయంలో సాంకేతిక అనుమతులు తీసుకుంటారు. సైట్ కండీషన్లను బట్టి కొంత మేర డీవియేషన్లు రాసేందుకు అవకాశం ఉంటుంది. కానీ సదరు భవనం విషయంలో భవన నిర్మాణాలు, రికార్డుల విషయంలో పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కినట్టు తెలుస్తున్నది. గ్రౌండ్, ఫస్ట్ఫ్లోర్లో భవన నిర్మాణం జరుగాల్సి ఉండగా కేటాయించిన నిధులను గ్రౌండ్ లెవల్లోనే మెజార్టీగా ఖర్చు అయ్యే విధంగా రికార్డు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పుట్టింగ్లు, కాం క్రీటు, డస్ట్, పునాదుల్లో సీఆర్, ఆర్ఆర్కు బదులు బ్రిక్ వర్క్, స్టీల్ సైతం అంచనాలకు రెట్టింపు స్థాయిలో రికార్డు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా సీఆర్, ఆర్ఆర్ విషయంలో రేటు 80శాతం తేడా ఉంటుంది. మొదటి అంతస్థు నిర్మించాల్సి ఉండగా నిధులు అయి పోయాయనే సాకుతో పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తు న్నది. ఈ డివియేషన్ను కార్పొరేషన్లోని ఒక ఉన్నతా ధికారి సిఫార్సు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
మళ్లీ నామినేషన్లు, ఓచర్ బిల్లులు...
రామగుండం నగర పాలక సంస్థలో వివిధ కార్యక్ర మాలు, పనులు, అత్యవసరాల పేర మళ్లీ నామినేషన్లు, ఓచర్ బిల్లులు చెల్లింపు నిత్యకృత్యమైంది. కార్పొరే షన్లో ఒక పండుగకు టెంట్లు వేసేందుకు టెండర్లు పిలువగా 40శాతం తక్కువ రేటుపై టెండర్లు దాఖల య్యాయి. మళ్లీ టెంట్ల పేర నామినేషన్లు ఇచ్చి కొందరు కాంట్రాక్టర్ల పేర ఓచర్ బిల్లులు రాయడం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. ఒక కార్యక్రమానికి, మరో కార్యక్రమానికి మధ్య సరఫరా చేసిన సామగ్రి అద్దెల్లో కూడా భారీ వ్యత్యాసం ఉంటుంది. అత్యవసరాల పేర పిలిచే బాక్స్ టెండర్లలో తక్కువ రేటుపై టెండర్లు దాఖలు చేయడం, రికార్డుల్లో తేడాలతో సర్దుబాట్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించి కొనుగోళ్లలో సైతం గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
రామగుండం నగరపాలక సంస్థలో గతంలో జరిగిన అవినీతి, కుంభకోణాలు విజిలెన్స్, ఏసీబీ విచారణల్లో వెలుగులోకి రావడం, ఇంజనీర్లు, కమిషనర్లు, అకౌంట్స్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంకా కొన్ని విచారణ దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలు ఆరోపణలు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది.