మొదలైన తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Feb 21 , 2025 | 12:14 AM
సుల్తానాబాద్ పట్టణంలోని మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం సుల్తానాబాద్లో విఫలమైంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరు సరఫరా జరగడం లేదు. ఇంటింటికి బిగించిన భగీరథ నల్లాల ద్వారా చుక్కనీరు రావడం లేదు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ పట్టణంలోని మంచినీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం సుల్తానాబాద్లో విఫలమైంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరు సరఫరా జరగడం లేదు. ఇంటింటికి బిగించిన భగీరథ నల్లాల ద్వారా చుక్కనీరు రావడం లేదు. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా పట్టణ ప్రజలకు తాగు నీటి కష్టాలు తప్పడం లేదు. ఎప్పుడూ లీకేజీలు, మరమ్మతులే. సమయపాలన అంటూ లేని నీటి సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమయపాలన లేకుండా నీరు విడుదల చేస్తుండడంతో కొన్ని సందర్భాలలో విషయం తెలియని మహిళలు నీళ్లు పట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా తాగునీటి సరఫరాలో ఇదే పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ పేరిట పట్టణంలోని రోడ్లను ధ్వంసం చేయడంతో అప్పటి వరకూ మెరుగ్గా ఉన్న నీటి సరఫరా చిన్నాభిన్నమైంది. మూడేళ్ళ నుంచి మిషన్ భగీరథ నల్లాలు పని చేయడం లేదు. గతంలో ఉన్న పాత నల్లాల ద్వారా నే ప్రస్తుతం రెండు రోజులకోమారు నీటి సరఫరా జరుగుతుంది.
కోట్లు వెచ్చించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు
మిషన్ భగీరథ పేరిట పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ ఆవరణలో రెండు లక్షల లీటర్ల సామర్థ్యం కల ఓవర్ హెడ్ ట్యాంకులు మూడు నిర్మించారు. కానీ అవి నిరుపయోగంగా మారాయి. ట్రయల్స్ వరకే పరిమితం చేశారు.
అప్పటి మేజర్ గ్రామ పంచాయతీ ప్రజల అవసరాల మేరకు రూపొందించిన రక్షిత మంచినీటి పథకం ప్రస్తుతం పెరిగిన పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడం లేదు. మున్సిపాలిటీ పరిధిలోని సుల్తానాబాద్ పట్టణంతోపాటు విలీన గ్రామాలైన పూసాల శాస్త్రినగర్, సుగ్లాంపల్లి, శ్రీరాములపల్లి గ్రామాలున్నాయి. మొత్తం పదిహేను వార్డులున్నాయి. ఈ పదిహేను వార్డుల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా కోసం ప్రస్తుతం 13 ఓవర్ హెడ్ ట్యాంకులు, నల్లాలు 5774 ఉన్నాయి. పదమూడు ట్యాంకుల్లో నాలుగైదు ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. నాలుగైదు రోజుల క్రితేమే ఉన్నతాధికారుల సూచన మేరకు వాటిని మళ్లీ ట్రయల్ రన్ నిర్వహించారు.
గట్టేపల్లి మానేరు నుంచి....
దశాబ్దాల నుంచి గట్టేపల్లి మానేరు వాగుల బావిలోని మోటార్ల తో పైపులైన్ల ద్వారా సుల్తానాబాద్ పట్టణంలోని అశోక్నగర్ ఎస్సారెస్పీ కాలువ పక్కన గల మంచినీటి బావిలో (సంప్) నీరు డంపింగ్ చేస్తున్నారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడంలో ఈ సంప్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంప్ నుంచి మార్కెట్ కమిటీ పక్కనున్న ట్యాంక్ ద్వారా పట్టణంలోని అన్ని వార్డులకు పైప్లైన్ల ద్వారా రెండురోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ పైప్లైను కూడా ట్యాంకుకు నేరుగా ఇచ్చారు. దాని ద్వారా వచ్చే నీరు కూడా ట్యాంక్లో పడుతుంది. ట్యాంక్ నిండిన సందర్భంలో రివర్స్లో పైప్లైన్ ద్వారా ఆ నీరు మల్లీ సంప్ బావిలో చేరుతుంది.
నాణ్యత లేని పనులు... తప్పని లీకేజీలు
శిథిలావస్థకు చేరిన పాత పైప్లైన్లతో పాటు నాణ్యత లేని మిషన్ భగీరథ పైప్లైన్లు రోజు ఎక్కడో ఓ చోట లీకేజీలకు గురవుతున్నాయి. దాంతో ఏదో ఒకటి రెండు వార్డులకు మంచినీరు రాని దుస్థితి ఏర్పడుతుంది. సమయపాలన లేక మహిళలు గంటల కొద్దీ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. రెండు రోజులకోసారి సరఫరాతో పనులకు వేళ్ళే వారు ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామాలలో ప్రతీ వేసవిలో బావులు ఇతర తాగునీటి వనరులు ఇంకిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ముఖ్యంగా పాత పైపులైన్లు తరుచూ దెబ్బతినడం, వాటిని మరమ్మతు కారణంగా మున్సిపాలిటికి ఆర్థిక భారం తప్పడంలేదు. గట్టేపల్లి మానేరు వాగులోని బావుల్లో ఉన్న మోటార్లు కూడా తరుచుగా కాలిపోతున్నాయి. వాటిని తీసి మరమ్మతుకు చేయించి మళ్లీ బిగించడం మున్సిపాలిటికి ఖర్చవుతోంది. రెండు రోజుల క్రితం వరుసగా మూడు మోటార్లు కాలిపోగా నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. మోటార్ల బిగింపు మరమ్మతు జరుగుతూనే ఉంది. రెండు రోజుల పాటు మిషన్ భగీరథ నుంచి నీటి సరఫరా నిలిపివేశారు.