నిందితులకు శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయి
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:32 PM
నిందితులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా అన్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పని చేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
కోల్సిటీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): నిందితులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా అన్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పని చేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరస్థులకు శిక్ష పడే విధంగా సాక్ష్యులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని, కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు మెదలాలని, దోషులకు శిక్ష పడడంలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత కీలకమైందన్నారు.
నేరస్థులకు వారెంట్లు, సమన్లు సత్వరమే జారీ అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని, కోర్టు ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలు, సూచనలు పాటించాలని, కోర్టులో పెండింగ్లో ట్రయల్ కేసులు, సమన్లు సీసీటీ ఎన్ఎస్లో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. ఏసీపీ రమేష్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సీసీఆర్బీ ఎస్ఐ చంద్రకుమార్, సీసీ హరీష్తో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం చెందిన మూగ, చెవిటి బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషికి శిక్ష పడేందుకు కృషి చేసిన అనువాదకుడు యేసేపును సీపీ అభినందించారు.