బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:48 PM
ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ తెలంగాణ బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గురువారం హైదరాబాదు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు.
గోదావరిఖని, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ తెలంగాణ బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గురువారం హైదరాబాదు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై 22నెలలుగా మసిబూసిమారేడు కాయ చేసి నిండా ముంచిందన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని కుట్ర చేసిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్రెడ్డి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని, బీసీలపై తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు నామమాత్రంగా జీఓ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారన్నారు. రిజర్వేషన్లు 50శాతం దాటకుండా సుప్రీంకోర్టు పరిమితి ఉందని, కేంద్రం వద్ద బిల్లు క్లియర్ కాదని తెలిసి 42శాతం బీసీ బిల్లు పేరుతో రేవంత్ ప్రభుత్వం డ్రామాలాడిందని, రాజ్యాంగ సవరణ లేకుండా అసెంబ్లీ తీర్మానంతో కోటారాదని విపక్షాలు, విద్యావంతులు చెప్పినా వినకుండా ఎన్నికల నోటిఫికేషన్ దాకా తెచ్చి చివరకు కోర్టు ముందు చేతులెత్తేసిందన్నారు. బీసీ సంఘాలు 18వ తేదిన తలపెట్టిన రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. నాయకులు బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మేతుకు దేవరాజ్, మేడి సదానందం పాల్గొన్నారు.