తెలంగాణ రైతాంగంపై బీజేపీ వివక్ష
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:48 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా కోటా తగ్గించి కక్ష సాధింపులకు పాల్పడుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. సోమవారం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
గోదావరిఖని, జూలై 14(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి యూరియా కోటా తగ్గించి కక్ష సాధింపులకు పాల్పడుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. సోమవారం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎఫ్సీఎల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందని, రైతాంగానికి ఎరువులు అందుబాటులో ఉంటాయని ప్రజలు భావించారన్నారు. మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఎఫ్సీఐ పునరుద్ధరణకు అన్నీ చర్యలు చేపట్టిందన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డా ఆర్ఎఫ్సీఎల్ నిర్మాణాన్ని స్వాగతించారన్నారు.
కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక యూరియా కేటాయించి తెలంగాణపై వివక్ష చూపుతుందన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్న బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గత సంవత్సరం కంటే ఆర్ఎఫ్సీఎల్ నుంచి 1.14లక్షల టన్నులు తక్కువ కేటాయించారని, జూలై కోటాలోనే 30వేల టన్నులు తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి విజ్ఞప్తి చేసినా సరఫరా పెరగలేదన్నారు. వరి నాట్ల సీజన్ మొదలైందని, పది రోజుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈలోపే కేంద్రం యూరియాను సరఫరా చేయాలని కోరారు. తాను కూడా కేంద్ర మంత్రిని కలిసి రైతాంగం ఇబ్బందుల గురించి వివరిస్తానన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో సైతం ఆర్ఎఫ్సీఎల్ నుంచి యూరియా కేటాయించకపోవడాన్ని లేవనెత్తుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, మల్లికార్జున్, తొగరి తిరుపతి, కామ విజయ్, జీన్స్, నర్సింగ్దొర తదితరులు ఉన్నారు.