Share News

యాసంగికి బేఫికర్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:50 AM

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటికిప్పుడు వరదలు నిలిచి పోయినా పూర్తి స్థాయి ఆయకట్టు రెండో పంటకు నీరందించడానికి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది.

యాసంగికి బేఫికర్‌

జగిత్యాల, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటికిప్పుడు వరదలు నిలిచి పోయినా పూర్తి స్థాయి ఆయకట్టు రెండో పంటకు నీరందించడానికి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి స్వల్పంగా 20 వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. కాలువల ద్వారా ప్రస్తుతం ఆయకట్టుకు నీరు అంతగా డిమాండ్‌ లేదు. నవంబర్‌ మొదటి వారం వరకు వానాకాలం సీజన్‌కు నీటి విడుదల నిలిపి వేసే అవకాశం ఉంది. అప్పటి వరకు వరి పంటలు పూర్తిగా కోతకు వస్తాయి. ప్రాజెక్టులోకి వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచే ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో ఆగస్టులోనే నిండిపోయింది. 80.501 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అప్పటి నుంచి మిగులు జలాలను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుత యేడాది జూన్‌ ఒకటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు డ్యామ్‌లోకి 880.969 టీఎంసీల వరద నీరు వచ్చింది. ప్రాజెక్టు నుంచి దిగువకు ప్రస్తుత సీజన్‌లో 813.256 టీఎంసీల నీటిని వదిలారు. నవంబరు చివరి వారం నుంచి యాసంగి ప్రణాళిక చేసి కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టే అవకాశం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రాజెక్టునకు పుష్కలంగా వరద నీరు రావడంపై ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫతగ్గుతూ....పెరుగుతూ....

ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుతూ పెరుగుతూ ఉంది. దీంతో ప్రాజెక్టు నుంచి గోదావరి నీటి విడుదలను తగ్గిస్తూ పెంచుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడం 20 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.501 టీఎంసీలు కాగా ప్రస్తుత పూర్తి స్థాయి నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్కులు, ఎస్కెప్‌ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, సరస్వతీ కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి ఆవడం ద్వారా 573 క్యూసెక్కులు వ్యయం అవుతోంది.

ఫడ్యామ్‌లోకి భారీ స్థాయిలో నీరు..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ప్రస్తుత సీజన్‌లో రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరింది. 1983-84 సంవత్సరంలో ప్రాజెక్టులోకి 1,165 టీఎంసీలు, 1988-89 సంవత్సరంలో 912.95 టీఎంసీలు, 1989-90 సంవత్సరంలో 576.28 టీఎంసీలు, 1990-91 సంవత్సరంలో 687.69 టీఎంసీలు, 1998-99 సంవత్సరంలో 552.44 టీఎంసీలు, 2005-06 సంవత్సరంలో 374.42 టీఎంసీలు, 2006-07 సంవత్సరంలో 515.48 టీఎంసీలు, 2021-22 సంవత్సరంలో 480 టీఎంసీలు, 2022-23 సంవత్సరంలో 200.682 టీఎంసీలు, 2023-24 సంవత్సరంలో 251.720 టీఎంసీలు, 2024-25 సంవత్సరంలో ఈనెల 24వ తేదీ వరకు 880.969 నీరు వచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి.

ఫబాబ్లీ మూసినా...

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈనెల 28వ తేదీ వరకు గోదావరి ఎగువ ప్రాంతంలోని మహరాష్ట్రలో గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచుతారు. మహారాష్ట్ర సర్కార్‌ బాబ్లీ ప్రాజెక్టును 2.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తి కోర్టుకు ఎక్కారు. ప్రతి యేడాది జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి అక్టోబరు 28వ తేదీ వరకు తెరిచి ఉంచాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ఈనెల 29న ఉదయం బాబ్లీ గేట్లను మూసి వేస్తారు. అయితే మరింత వరద నీరు పెరిగితే బాబ్లీ గేట్లు మూసివేయడం కష్టమే. మూసేసినా ఎస్సారెస్పీ ఆయకట్టుకు యాసంగికి ఢోకా లేకుండా నీరు సరఫరా చేయవచ్చు. వానాకాలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టారు. ప్రస్తుతం యాసంగిలో కూడా అంతేస్థాయి ఆయకట్టు నీటి సరఫరా చేపట్టే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఫఎస్సారెస్పీ ఆయకట్టు..

ఎస్సారెస్పీ మొదటి దశ ఆయకట్టు 9,68,640 ఎకరాలు, రెండో దశ 4,40,000 ఎకరాలు ఉంది. వరద కాలువ 2,20,000 ఎకరాలు, సదరమట్‌ ఆయకట్టు 12,000 ఎకరాలు, కడెం ప్రాజెక్టు 68,000 ఎకరాలు, అలీసాగర్‌ ఎత్తిపోతలు 57,793 ఎకరాలు, గుత్ప ఎత్తిపోతల పథకం 38,967 ఎకరాలు, చౌటుపల్లి హన్మంత్‌ రెడ్ది ఎత్తిపోతలు 11,600 ఎకరాలు,నిజామాబాద్‌ జిల్లాలో 14 ఎత్తిపోతలు పథకాలకు 34,948 ఎకరాలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 9 ఎత్తిపోతలు 30,417 ఎకరాలు ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఆయకట్టు 18,66,765 ఎకరాలు ఉంది.

ఫజిల్లాలో కాలువల ద్వారా సాగు నీరు ఇలా..

జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు సుమారు 91 కిలోమీటర్ల మేర కాకతీయ కాలువ ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు విడుదల చేస్తున్న నీరు 25వ కిలోమీటరు వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవహిస్తోంది. 116వ కిలో మీటరు వద్ద ముగుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు కాకతీయ కాలువకు అనుబంధంగా ఉప కాలువలను నిర్మించి నీరు సరాఫరా చేస్తున్నారు. జిల్లాలో డీ-21 ఉప కాలువ నుంచి డీ 83ఏ వరకు దాదాపుగా 62 డిస్ట్రిబ్యూటర్‌ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీకి ఆయకట్టును బట్టి ఎడమ, కుడి వైపులకు మరో 50 వరకు కాలువలు ఉంటాయి. సంబంధిత మైనర్‌ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు అందించాల్సి ఉంటుంది. జిల్లాలో దాదాపుగా ఎస్సారెస్పీ ద్వారా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు సమీపంలో ఉండే చెరువులు, కుంటలు నింపేందుకు తూములు ఏర్పాటు చేయడం వల్ల సుమారు మరో లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు అందుతోంది.

ఫయాసంగిలో 3.55 లక్షల ఎకరాల సాగు అంచనా..

జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3.55 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు. జిల్లాలో వరి పంట 3,03,000 ఎకరాలు, మొక్కజొన్న 27,200 ఎకరాలు, నువ్వులు 21,500 ఎకరాలు, పల్లి 460 ఎకరాలు, పెసర 400 ఎకరాలు, మినుము 250 ఎకరాలు, ఆలసంద 300 ఎకరాలు, ఆవాలు 3,100 ఎకరాలు, చెరుకు 890 ఎకరాలు, ఆయిల్‌ ఫామ్‌ 800 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:50 AM