యూరియా పంపిణీపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:38 PM
రైతులకు యూరియా పంపిణీలో ఈ నెలాఖరు వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, అక్టోబర్ 6 (ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియా పంపిణీలో ఈ నెలాఖరు వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో యూరియా లభ్యత, పంపిణీపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ వ్యవసాయ అవసరాలకు యూరియా పంపిణీ సంబంధించి డిమాండ్ సమయం ముగిసిందని, అధికారులు రిలాక్స్ కాకుండా ఈ నెలాఖరు వరకు అప్రమత్తంగా ఉంటూ పెండింగ్ డిమాండ్కు రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నుంచి స్టాకు పక్క జిల్లాలకు అక్రమంగా తరలి పోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగే దిశగా వ్యవసాయ శాఖ నుంచి కార్యాచరణ వ్యవసాయ విస్తరణ అధికారుల వారీగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ సహాయ సంచాలకులు అంజనీ, శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.