ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి
ABN , Publish Date - May 06 , 2025 | 12:07 AM
విప్లవోద్యమంతో తనకు బంధాలు తెగిపోయినా, అదివాసీయుల పేగు బంధం తెగిపోలేదని, ఆదివాసీ ప్రాంతాల్లో స్వేచ్ఛ, శాంతియుత వాతవరణం నెలకొల్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ధర్మారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ధర్మారం, మే 5 (ఆంధ్రజ్యోతి): విప్లవోద్యమంతో తనకు బంధాలు తెగిపోయినా, అదివాసీయుల పేగు బంధం తెగిపోలేదని, ఆదివాసీ ప్రాంతాల్లో స్వేచ్ఛ, శాంతియుత వాతవరణం నెలకొల్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ధర్మారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఆపరేషన్ కగార్తో ఆదివాసీ బిడ్డలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకుండా ఆదివాసి ప్రాంతాల్లో స్వేచ్ఛ, శాంతి వాతావరణం నెలకొల్పడం ఈ రాష్ట్రంతో పాటు దేశానికి అవసరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం - అభివృద్ధి రెండు కళ్ల లాంటివని, సంక్షేమాన్ని మరువకుండా అభివృద్ధిని విస్మరించకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానంతోనే దేశంలో కులగణన చేపట్టారని, అందుకు తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణతోపాటు పేదలకు లబ్ధి జరిగే సంక్షేమ పథకాలను సీఎం రేవంత్రెడ్డి చేపడుతున్నారన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగులను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే 60 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుందన్నారు.
ధర్మారం తెనుగువాడ నుంచి ఎండపల్లి ఎక్స్ రోడ్డు వరకు సీఆర్ఆర్ గ్రాంటు నుండి 3 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటి రోడ్డు నిర్మాణానికి, ఖిలావనపర్తిలోని పోచమ్మ ఒర్రె వద్ద సీఆర్ఆర్ గ్రాంటు నుంచి కోటి 25 లక్షల వ్యయంతో పనులకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి శంకుస్థాపస చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్సు వంటి పథకాలు పేద ప్రజల కోసం చేపడుతున్నామన్నారు. అంగన్వాడి టీచర్ల సమస్యలపై అవగాహన ఉందని, ఎన్నడూ లేని విధంగా అంగన్వాడి బడులకు సెలవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజ్ఠాకూర్సింగ్, కలెక్టర్ కోయా శ్రీహర్ష, తహసీల్దార్ వకీల్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏఈ రాజశేఖర్, అనుదీప్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.