ఫలించిన నిరీక్షణ
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:56 AM
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు జీవో నంబరు 250ను ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ జారీ చేశారు.
జగిత్యాల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు జీవో నంబరు 250ను ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ జారీ చేశారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 101 మంది ఉద్యోగులకు బదిలీ అవకాశం ఏర్పడింది. బదిలీల ప్రక్రియ పూర్తయితే, జిల్లా వ్యాప్తంగా సెర్ప్ విభాగంలోని అన్ని కేడర్లలో కొత్త ఉద్యోగులు చేరనున్నారు.
ఫపదేళ్లుగా ఎదురుచూపులు
గత యేడాది జూలైలో జరిగిన ఉద్యోగుల సాధారణ బదిలీల సందర్భంగా సెర్ప్ ఉద్యోగులు తమకు అవకాశం కల్పించాలని కోరినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. సెర్ప్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు వర్తింపజేయకపోవడంతో వారిలో గత కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2023 నుంచి సెర్ప్ సిబ్బందికి పే-స్కేల్ విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ బదిలీలు, పదోన్నతుల విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యూనియన్ నాయకులు గతంలో సంబంధిత శాఖ మంత్రులతో అనేక సార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలపడంతో వారి దీర్ఘకాల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది.
ఫ మహిళలకు ఉపాధి కల్పనలో కీలకం
సెర్ప్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక ఎదుగుదల, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్నేళ్లుగా సెర్ప్ ఉద్యోగులు అత్యంత కీలక సేవలు అందిస్తున్నారు. సెర్ప్లో మినిస్టీరియల్, ఫీల్డ్ సిబ్బంది, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్లు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కేడర్లలో మొత్తం 101 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఫవెలుగు నుంచి సెర్ప్ వరకు...
2000లో ఉమ్మడి ఆంధ్రపదేశ్లో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం వెలుగు పేరుతో సంస్థను కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. 2002లో ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చగా, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని గ్రామీణ పేదరిక నిర్మూలణ సంస్థ (సెర్ప్)గా నామకరణం చేసింది. 2002 నుంచి సెర్ప్ ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. 2023 ఏప్రిల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వీరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. అయితే పే-స్కేల్ ఇతర సౌకర్యాలు వర్తింపజేసినప్పటికీ, బదిలీలు, పదోన్నతుల విషయంలో ఇంకా పూర్తి స్థాయి అమలు జరగాల్సి ఉంది.
ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం
-కోల శ్రీనివాస చక్రవర్తి, సెర్ఫ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. ఉద్యోగులు పదేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన చాలామంది సిబ్బంది పదేళ్లు, అంతకంటే ఎక్కువగానే ఒకేచోట పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వనుండటంతో దాదాపు అందరికీ స్థానచలనం కలుగుతుందని భావిస్తున్నాం.
----------------------------------------------------
జిల్లాలో ఉద్యోగుల వివరాలు..
----------------------------------------------------
అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్....1
డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్లు...5
అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు...20
క్లస్టర్ కో ఆర్డినేటర్లు(ఎల్2)...53
క్లస్టర్ కో ఆర్డినేటర్లు (ఎల్1)...2
అడ్మిన్ అసిస్టెంట్లు(కంప్యూటర్ ఆపరేటర్లు)....3
మండల సమాఖ్య కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు..14
అటెండర్లు...3
----------------------------------------------------
మొత్తం ఉద్యోగులు....101
----------------------------------------------------