‘ఎల్హెచ్బీ’లతో మరిన్ని రైళ్లు
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:17 AM
ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్న లింక్ హాఫ్మన్ బుష్(ఎల్హెచ్బీ) ప్యాసింజర్ బోగీలను ఇకపై మరిన్ని రైళ్లలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.
త్వరలోనే ప్రవేశపెట్టనున్న రైల్వే శాఖ.. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్న లింక్ హాఫ్మన్ బుష్(ఎల్హెచ్బీ) ప్యాసింజర్ బోగీలను ఇకపై మరిన్ని రైళ్లలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. బోగీ నుంచి వచ్చే శబ్దం, కుదుపులు తక్కువగా ఉండటంతో వీటిలో ప్రయాణానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జర్మన్ సాంకేతికతతో తయారవుతున్న ఈ కోచ్లను తొలుత ఢిల్లీ-లక్నో మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ కోసం దిగుమతి చేసుకున్నారు. ఆపై టెక్నాలజీ షేరింగ్ ఒప్పందంతో దేశంలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీల్లోనూ ఈ బోగీలు తయారవుతున్నాయి. గతేడాది వరకు వివిధ కోచ్ ఫ్యాక్టరీల నుంచి సుమారు 50వేలకు పైగా ఎల్హెచ్బీలను తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 50శాతం రైళ్లకు ఎల్హెచ్బీ కోచ్లను వినియోగిస్తుండగా, 2030నాటికి అన్ని రైళ్లు ఎల్హెచ్బీ లేదా వందేభారత్ తరహా కోచ్లతోనే పరుగులు తీయనున్నాయి. తక్కువ బరువు.. ఎక్కువ పొడవు, వెడల్పుతో తయారైన ఎల్హెచ్బీ కోచ్లు ప్రయాణికుల సీటింగ్/బెర్తుల విషయంలో అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
అధునాతన సాంకేతికతలతో..
ఎల్హెచ్బీ కోచ్లకు అమర్చిన యాంటీ టెలీస్కోపిక్ టెక్నాలజీ, అధునాతన ఎయిర్ డిస్క్ బ్రేక్ కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు, రైలు పట్టాలు తప్పినప్పుడు బోగీలు పల్టీ కొట్టకుండా ఉంటాయి. అలాగే, యాంటీ క్లైంబింగ్ సాంకేతికతతో లాక్ సెంటర్ బఫర్ కప్లర్ను కలిగి ఉండడం వలన ప్రమాదాలు జరిగినపుడు రైలు బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కకుండా ఉంటాయి. దీని వల్ల రెస్క్యూ ఆపరేషన్ సులువు కానుంది. మరోవైపు, ఎల్హెచ్బీ కోచ్లు మెరుగైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తాయి. వీటిని గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించేందుకు అనువుగా రూపొందించారు. ఈ కోచ్లలో ఉపయోగించిన సామగ్రి అగ్ని నిరోధకతను కలిగి ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించకుండా కట్టడి చేచేందుకు వీలవుతుంది. అలాగే, కుదుపులు లేని ప్రయాణం కోసం ఈ కోచ్లను వెస్టిబ్యూల్ డిజైన్తో రూపొందించారు.
త్వరలోనే మరిన్ని రైళ్లకు ఎల్హెచ్బీలు..
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నడుస్తున్న పలు రెగ్యులర్, స్పెషల్ రైళ్లకు ఎల్హెచ్బీ కోచ్లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైవు వెళ్లే గోదావరి, విశాఖ, ఫలక్నుమా ఎక్స్ప్రె్సలు.. న్యూఢిల్లీ వైపు వెళ్లే తెలంగాణ, దక్షిణ్.. ముంబై వైపు వెళ్లే హుస్సేన్ సాగర్.. తిరుపతి వైపు వెళ్లే నారాయణాద్రి, పద్మావతి, సింహపురి ఎక్స్ప్రె్సలన్నీ ఎల్హెచ్బీ కోచ్లతోనే నడుస్తున్నాయి. తిరుపతి వైపు వెళ్లే వెంకటాద్రి, చెన్నై, శబరి ఎక్స్ప్రె్సలు.. విజయవాడ వైపు వెళ్లే నర్సాపూర్, మచిలీపట్నం ఎక్స్ప్రె్సలను త్వరలోనే ఎల్హెచ్బీ కోచ్లతో నడపాలని దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.