Share News

CM Revanth Reddy: కేసులు పెడితే భయపడేది లేదు

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:46 PM

ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 7వ తేదీన వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ఆయన ప్రకటించారు.

CM Revanth Reddy: కేసులు పెడితే భయపడేది లేదు
TG CM Revanth reddy

హైదరాబాద్, డిసెంబర్ 02: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ సిబ్బందికి వీరు ఆర్థిక సహాయం అందించారన్నారు. ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఉండవని.. ఈ నేపథ్యంలో ఎప్పుడో మూతపడిన నేషనల్‌ హెరాల్డ్‌ సిబ్బందిని మంచి ఆలోచనతో వీరు ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. పత్రికను తిరిగి నడిపించాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లుగా కొంత మంది కాంగ్రెస్‌ పార్టీ నేతలను తీసుకున్నారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నిర్ణయించి.. నేషనల్ హెరాల్డ్‌ పత్రిక పునరుద్దరించే ప్రక్రియను వారు చేపట్టారని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలో కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఆయన సోదాహరణంగా వివరించారు.


ఉస్మానియాను ప్రపంచస్థాయిలో నిలబెడతాం: సీఎం రేవంత్

డిసెంబర్ 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామన్నారు. 9వ తేదీన తెలంగాణ - 2047 పాలసీ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి దిగ్గజ నేతల సలహాలు సైతం తీసుకున్నామని పేర్కొన్నారు.


ఓఆర్ఆర్ బయటకు పరిశ్రమలు..

కోర్‌ అర్బన్‌ను క్యూర్‌ చేయాలని తాము నిర్ణయించామన్నారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, పరిశ్రమల తరలింపు తదితర అంశాలు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు. కొన్ని పరిశ్రమలు నడిచే పరిస్థితి లేక మూతపడ్డాయన్నారు. మరికొన్ని పరిశ్రమల ఊరు, నగరం నడిబొడ్డున ఉన్నాయని.. ఆయా పరిశ్రమలను తరిలిస్తే కొంత భూమి అందుబాటులోకి వస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్‌పై ఫైర్..

అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు ఒక్క ఎయిర్‌పోర్టు కూడా తేలేదంటూ బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎయిర్‌పోర్టులు తెచ్చామని గుర్తు చేశారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు. 2034 నాటికి తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమీ రాష్ట్రంగా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. అందరి కృషితో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.


డీసీసీలకు వార్నింగ్..

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. కోటి మంది మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు. చీరలు అందలేదంటూ ఫిర్యాదులు వస్తే అందుకు డీసీసీలదే బాధ్యత అంటూ సీఎం హెచ్చరించారు. డిసెంబర్‌ నెలాఖరులోగా మహిళలందరికీ చీరలు అందించాలని డీసీసీలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌పై సమీక్ష.. అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

మాఫియా లేడీ డాన్ కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

For More TG News And Telugu News

Updated Date - Dec 02 , 2025 | 02:55 PM