Ponnam On Kurnool Bus Fire: ఈ ఘటన దురదృష్టకరం.. ట్రావెల్స్ యజమానులకు మంత్రి వార్నింగ్
ABN , Publish Date - Oct 24 , 2025 | 09:43 AM
ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి, కలెక్టర్, డీఐజీలతో మాట్లాడినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని.. చాలా బాధ కలిగిందని ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాద వివరాలు తెలుసుకున్నారని.. సహాయక చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి, కలెక్టర్, డీఐజీలతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు.
కేసులు పెడతాం.. లోపలేస్తాం...
అలాగే ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల యజమానులు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం సహించమని అన్నారు. హత్యా నేరం కింద కేసులు పెడతామని.. లోపలేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. స్పీడు నిబంధనలు పాటించాలని.. ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని అన్నారు. రవాణా శాఖ రోజువారీ తనిఖీలు చేస్తే వేధింపులని ఆరోపిస్తున్నారని.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన బస్సు ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తోందని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక మూడు రాష్ట్రాల మంత్రులం కలిసి రవాణా కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
బస్సు ప్రమాదంపై కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.. నంబర్లివే..
కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు కేసీఆర్ సంతాపం
Read Latest Telangana News And Telugu News