Share News

Congress: ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం

ABN , Publish Date - Jan 15 , 2025 | 11:11 AM

Congress: ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అగ్రినేత సోనియా గాంధీ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఆరు అంతస్తులో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయానికి ఇందిరాభవన్ అని నామకరణం చేశారు.

Congress: ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం
Indira Bhavan delhi

న్యూఢిల్లీ, జనవరి 15: ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. బుధవారం ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ(Soni Gandhi) ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikharjuna Kharge) నూతన భవనంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ భవానానికి ఇందిరాభవన్‌గా నామాకరణం చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, కేసw వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి 400 మందికి ఆహ్వానాలు వెళ్లాయి. ఆరు అంతస్తులో ఆధునిక సౌకర్యాలతో ఏఐసీసీ కొత్త కార్యాలయాన్ని నిర్మించారు.


15 సంవత్సరాలుగా నిర్మాణం...

కాగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు ఉండకూడదని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ పార్టీలు తమ సొంత భవనాలను నిర్మించుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా నూతన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 9 ఏ కోట్లా రోడ్డులో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆరు అంతస్తులతో ఇందిరాభవన్‌‌‌ను నిర్మించారు. 2009లో కొత్త భవనం నిర్మాణాన్ని చేపట్టగా.. దాదాపు 15 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ చేతుల మీదుగా ఏఐసీసీ కొత్త భవనం ప్రారంభమైంది. అయితే దాదాపు ఐదు దశాబ్దాలుగా అక్బర్‌ రోడ్డు 24 నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే నూతన భవనంలో ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినప్పటికీ.. పాత బిల్డింగ్‌లో కూడా కార్యకలాపాలు కొనసాగుతాయని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.


పార్టీ పెద్దలతో రేవంత్..

మరోవైపు ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రాంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అధిష్ఠానం పెద్దలతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టులు, కార్యవర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే పలువురు కేంద్రమంత్రులను కూడా రేవంత్ కలువనున్నారు. ముఖ్యమంత్రి వెంట టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర నేతలు ఉన్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు తెలంగాణ సీఎం బయలుదేరి వెళ్లనున్నారు.

Updated Date - Jan 15 , 2025 | 11:26 AM