CM Revanth Reddy: పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:55 AM
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అన్నారు.....
ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్
చైనా+1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ
గత ప్రభుత్వాలన్నీ పెట్టుబడులకు పెద్దపీట వేశాయ్.. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
మూసీ పునరుజ్జీవంతో నైట్ ఎకానమీలో కీలక వృద్ధి.. రోడ్లకు ఇకపై గూగుల్, మెటా, టీసీఎస్ తదితర సంస్థల పేర్లు
‘యూఎస్ ఐఎ్సపీఎఫ్’లో సీఎం రేవంత్.. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ ప్రదర్శన.. టెక్ దిగ్గజాల ప్రశంసలు
న్యూఢిల్లీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అన్నారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఢోకా లేదని తెలిపారు. దేశంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో యువశక్తి ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (యూఎస్ ఐఎ్సపీఎ్ఫ)లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గత 35 ఏళ్లుగా కాంగ్రె్సతోపాటు అనేక పార్టీల ప్రభుత్వాలు సారథ్యం వహించినా.. పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు మద్దతుగా నిలిచాయని వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని తెలిపారు. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) హబ్గా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితోపాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 30 వేల ఎకరాల్లో అద్భుతమైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని అన్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు - రీజినల్ రింగ్ రోడ్డు మధ్య తయారీ జోన్ వంటి కీలక మౌలిక ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు. చైనా ప్లస్ 1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని చెప్పారు (చైనాకు అదనంగా మరో ఉత్పాదక కేంద్రం ఏర్పాటును చైనా ప్లస్ 1 మోడల్ అంటారు).
రోడ్లకు ఆ సంస్థల పేర్లు పెడతాం..!
భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నాయకుల పేర్లు ఉంటాయని, హైదరాబాద్లో ఆ ట్రెండ్ను మార్చేయాలని అనుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లను పెడతామని ప్రకటించారు. అలాగే, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంప్సలు ఏర్పాటు చేస్తే, తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు హైదరాబాద్కు రావాలని ఆహ్వానించారు. సదస్సు ప్రారంభంలో ఆయన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్రెడ్డి లక్ష్యానికి విశేష ఆదరణ లభించింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సీఎం వివరించిన తీరు ప్రపంచ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి వెంట తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉందని టెక్ దిగ్గజం, సిస్కో మాజీ సీఈవో జాన్ చాంబర్స్ కొనియాడారు. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు తమ సభ్యుల్లో ఎక్కువ మంది డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతామని యూఎస్ ఐఎ్సపీఎఫ్ అధ్యక్షుడు ముఖేశ్ ఆఘి తెలిపారు. తెలంగాణ విజన్ను తెలుసుకునేందుకు తామంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పారు.