Hyderabad: డబుల్ స్కాం.. దర్యాప్తు ముమ్మరం
ABN , Publish Date - Jul 25 , 2025 | 10:22 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వెలుగుచూసిన రెండు పడకల ఇళ్ల కుంభకోణంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల కేటాయింపునకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది.
- పాత్రధారుల అరెస్టు.. సూత్రధారుల కోసం అన్వేషణ
- ఎమ్మెల్యే మాజీ పీఏ కస్టడీ కోరనున్న పోలీసులు
- ఆర్డీఓ సంతకం ఫోర్జరీ.. రూ.కోట్లు వసూలు
- నకిలీ తతంగంపై కలెక్టర్ ఆగ్రహం
- సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Qutubullapur Constituency)లో వెలుగుచూసిన రెండు పడకల ఇళ్ల కుంభకోణంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల కేటాయింపునకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది. ఈ పత్రాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన గడ్డం శ్రీధర్ ముదిరాజ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాజీ పీఏ హరిబాబును అరెస్ట్ చేయడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
తాను పాత్రధారినే..
హరిబాబు అరెస్టు సమయంలో పలు కీలక విషయాలు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. తాను కేవలం పాత్రధారిని మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని పేర్కొన్నట్టు సమాచారం. ఇళ్ల కుంభకోణానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన వారు వేరే ఉన్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. వందల మంది నుంచి ముఠా రూ.కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు. కొందరు బాధితులు ఇప్పటీకి బయటకు చెప్పేందుకు సాహసించడం లేదు. సూత్రధారులు, పాత్రదారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
నకిలీ పత్రాలపై కలెక్టర్ ఆగ్రహం..
నకిలీ కేటాయింపు పత్రాలు సృష్టించి పేదలను మోసం చేయడంపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆగ్రహంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ సంతకంతో తయారు చేసిన నకిలీ డబుల్ బెడ్రూం ఇళ్ల అలాట్మెంట్ లెటర్లను కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు కలెక్టర్ కార్యాలయానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి ఎవరు.? ముఠాకు నాయకత్వం వహించిందెవరు..? వసూలుచేసిన డబ్బు ఎవరి వద్దకు చేరిందనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. కుంభకోణంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందా..? అన్నకోణంలోనూ విచారణ సాగుతోంది. శ్రీధర్ను అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Read Latest Telangana News and National News