ఎన్కెపల్లిలో గోశాల ఏర్పాటుకు ప్రణాళిక
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:54 AM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎన్కెపల్లిలో గోశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
99.12 ఎకరాల్లో నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలు
మొయినాబాద్, మే, 31 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఎన్కెపల్లిలో గోశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఎన్కెపల్లిలోని సర్వే నెంబర్ 180లో ఉన్న 99.12 ఎకరాల ప్రభుత్వ భూమిలో దానిని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే, ఆ భూమిలో యాభై ఏళ్లుగా గ్రామానికి చెందిన సుమారు 60 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమికి సంబంధించి తమకు పట్టాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి అర్జీలు కూడా పెట్టుకున్నారు. ఆ స్థలంలో గోశాల ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో రెవెన్యూ అధికారులను, స్థానిక ఎమ్మెల్యేను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. సాగులో ఉన్న తమకు హక్కులు కల్పించాలని కోరారు. కాగా, నగరానికి చేరువలో ఎన్కెపల్లిలో గోశాల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. రెవెన్యూ రికార్టుల్లో ప్రభుత్వ భూమిగానే ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రాజన్న గోశాలకు వంద ఎకరాలు కేటాయించాలి
విశ్వహిందూపరిషత్ డిమాండ్
హైదరాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న గోశాలకు వంద ఎకరాలు కేటాయించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వీహెచ్పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి కోరారు. గోశాలలో ఒక్కరోజే 12 కోడెదూడలు చనిపోవడం అత్యంత విషాదకరమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరుడికి కోడెదూడలను సమర్పిస్తున్న భక్తుల మనోభావాలను గాయపరిచేలా అధికారులు వ్యవహరిస్తున్నారని బాలస్వామి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News