Rice Millers: మార్కెట్ సెస్ రూ.40 కోట్లు ఎగవేత
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:29 AM
టెండరు ధాన్యం విక్రయాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ధాన్యం విలువపై మార్కెటింగ్ శాఖకు రావాల్సిన ఒక శాతం పన్ను ఇంత వరకు వసూలు కాలేదు.
టెండరు ధాన్యంపై మార్కెటింగ్ శాఖ ఆదాయానికి గండి
రైస్ మిల్లర్లు, టెండరు ఏజెన్సీల మధ్య తెగని పంచాయితీ
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): టెండరు ధాన్యం విక్రయాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ధాన్యం విలువపై మార్కెటింగ్ శాఖకు రావాల్సిన ఒక శాతం పన్ను ఇంత వరకు వసూలు కాలేదు. టెండరు ఏజెన్సీలే మార్కెట్ సెస్ చెల్లించాలని రైస్ మిల్లర్లు మొండికేస్తుండగా.. ప్రభుత్వం సెస్ రద్దుచేయాలని, లేకపోతే రైస్మిల్లర్లే సెస్ చెల్లించాలని ఏజెన్సీలు పేచీ పెట్టాయి. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ సురేంద్రమోహన్కు టెండరు ఏజెన్సీలు లేఖ రాసి.. మార్కెట్ సెస్ మినహాయించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇదే జరిగితే రూ.40 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. ఏడాదిన్నరగా నయాపైసా చెల్లించకపోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాసంగి 2022-23 సీజన్కు చెందిన 38 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం వేలంలో విక్రయించింది. ఇప్పటి వరకు 19 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం లిఫ్టింగ్ పూర్తికాగా.. పౌర సరఫరాల సంస్థకు రూ.4వేల కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ టర్నోవర్పై మార్కెట్ సెస్ కింద ఒక శాతం(రూ.40 కోట్ల) ఆదాయం మార్కెటింగ్ శాఖకు రావాల్సి ఉంది. టెండరు నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏజెన్సీలే మార్కెట్ సెస్ చెల్లించాలి. కానీ ఏడాదిన్నరలో టెండరు ఏజెన్సీలు పైసా చెల్లించలేదు. పైగా, ఇప్పుడు మార్కెట్ సెస్ ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. వాస్తవానికి టెండరు ఏజెన్సీలు ధాన్యం ఎత్తకుండా.. కాగితాలపైనే లావాదేవీలు నిర్వహించాయి. రైస్మిల్లర్ల నుంచి డబ్బులు తీసుకొని.. ధాన్యాన్ని వారికే అంటగట్టాయి. దీంతో టెండరు ఏజెన్సీల నుంచి రైస్మిల్లర్లు, ఇతర కంపెనీలు ధాన్యం కొనుగోలు చేసినట్లేనని, ధాన్యం కొనుగోలు చేసిన వారే సెస్ చెల్లించాలని టెండరు ఏజెన్సీలు మెలిక పెట్టాయి. మరోవైపు, ఇదంతా ప్రభుత్వానికి, టెండరు ఏజెన్సీలకు మధ్య వ్యవహారమని, మార్కెట్ సెస్తో తమకు సంబంధంలేదని మిల్లర్లు వాదిస్తున్నారు. అయితే ఎత్తిన ధాన్యం విలువపై ఒక శాతం సెస్ చెల్లించాలని మార్కెటింగ్ శాఖ నుంచి మిల్లర్లకు నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై మిల్లర్లు స్పందించటంలేదని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..
ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన
Read latest Telangana News And Telugu News