Meerapet: బకెట్లో హీటర్తో ఉడికించాడు!
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:28 AM
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడెంత పకడ్బందీగా వ్యవహరించినా ‘ఖానూన్ కే హాత్ లంబే హోతే హై’ అనేది మరోసారి రుజువైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... హైదరాబాద్, మీర్పేట మహిళ మర్డర్ కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు.

వీడిన హైదరాబాద్ మీర్పేట మహిళ మృతి కేసు మిస్టరీ
భార్య మాధవితో గొడవపడి తోసేసిన మాజీ సైనికుడు గురుమూర్తి
ఆమె శవాన్ని మాయం చేసేందుకు పథకం
మొద్దుపై కత్తితో ముక్కలు.. అవశేషాలు మీర్పేట చెరువులో..
ఆపై ఇల్లంతా శుభ్రం.. అయినా పట్టించిన ‘బ్లూ రేస్ టెక్నాలజీ’
బాత్రూమ్, గదిలో, మొద్దుపై అవశేషాల ఆనవాళ్లు లభ్యం
నిందితుడిని నేడు రిమాండ్ చేసే అవకాశం!
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ‘‘అవును.. నా భార్యను నేనే చంపాను. మీ దగ్గర ఆధారాలుంటే అరెస్టు చేసుకోండి’’ అంటూ విచారణలో భాగంగా ఒకరంగా పోలీసులకు సవాలే విసిరిన మాజీ సైనికుడు గురుమూర్తి ఆటకట్టయింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడెంత పకడ్బందీగా వ్యవహరించినా ‘ఖానూన్ కే హాత్ లంబే హోతే హై’ అనేది మరోసారి రుజువైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... హైదరాబాద్, మీర్పేట మహిళ మర్డర్ కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికిన విషయం వాస్తవమే! అయితే వాటిని ఉడికించింది కుక్కర్లో కాదు.. బకెట్ నీళ్లలో ముక్కలు వేస్తూ హీటర్ పెట్టి విడతల వారీగా ఉడికించాడు! తర్వాత ఆ అవశేషాలను మీర్పేట చెరువులో పడేశాడు! ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరక్కుండా ఇల్లంతా శుభ్రం చేసినా గురుమూర్తి తప్పించుకోలేకపోయాడు. అత్యాధునిక ‘బ్లూ రేస్ టెక్నాలజీ’తో ఇంట్లో మాంసం, రక్తం ఆనవాళ్లను పోలీసులు గుర్తించి గురుమూర్తే నిందితుడని తేల్చారు. నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును అతడు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆ కత్తిని ఏం చేశాడు? అనేవి తెలియాల్సి ఉంది.
మృతదేహాన్ని పొద్దంతా నరికాడు
అసలేం జరిగిందంటే.. కొన్నాళ్ల క్రితం బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలో మాధవి తల్లిదండ్రులు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. అది మనసులో పెట్టుకొని అవకాశం దొరికినిప్పుడల్లా మాధవితో గొడవపడేవాడు. సంక్రాంతికి ఇద్దరు పిల్లలను, భార్యను వెంటబెట్టుకొని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు. పండుగ అక్కడే జరుపుకొన్నారు. బడికి సెలవులు కావడంతో పిల్లలను అక్కడే వదిలేసి, అదేరోజు సాయంత్రం గురుమూర్తి, మాధవి ఇంటొకి తిరిగొచ్చారు. మర్నాడు.. అంటే 15న రాత్రి మద్యం మత్తులో భార్యతో గురుమూర్తి గొడవపడి కొట్టాడు. ఆమె విసురుగా కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. కంగారుపడిపోయిన గురుమూర్తి, తాను పట్టుబడకుండా ఉండేందుకు మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందుకోసం యూట్యూబ్లో రాత్రంతా వీడియోలు చూసి ఓ నిర్ణయానికొచ్చాడు. 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్రూమ్ వద్దకు లాక్కెళ్లి.. అక్కడ చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు.
పొద్దంతా అతడు ఇదే పనిలో ఉన్నాడు. రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు. అనంతరం వాటిని మూటగట్టి మీర్పేట పెద్ద చెరువులో వేశాడు. ఇంటికి తిరిగొచ్చి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. ఇంటి యజమాని, తన కుటుంబసభ్యులతో సహా బెంగళూరులో ఉండటం, తన పిల్లలు బంధువుల ఇంట్లో ఉండటంతో గురుమూర్తికి అనుకూలించింది. 17న అత్తామామలకు అతడు ఫోన్ చేసి.. తనతో గొడవపడి మాధవి అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. అదేరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లిలో ఉం టున్న మాదవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ మీర్పేటకు చేరుకుంది. అల్లుడితో కలిసి బంధువుల ఇళ్లలో, తెలిసినవారి ఇళ్లలో వాకబు చేసినా ఆమె జాడ తెలియరాలేదు. 18న అల్లుడితో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అదేరోజు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు గురుమూర్తి చెప్పినట్లుగా.. మాధవి ఇంట్లోంచి వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే చంపినట్లు ఒప్పుకొన్నాడు. అయితే మాధవిని హత్యచేసినట్లు బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీతో ఇల్లంతా జల్లెడ పట్టారు. బాత్రూమ్లో, గదిలో ఉన్న దుస్తులపై, మృతదేహాన్ని ముక్క లు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ మాంసపు అవశేషాలు ఈ టెక్నాలజీ ద్వారా పోలీసులకు దొరికాయి. ఈ మేరకు శాస్త్రీయ ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. నిందితుడు గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. శనివారం అతడిని రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతడిచ్చిన సమాచారంతో మీర్పేట పెద్దచెరువులో వెతగ్గా మృతదేహానికి సంబంఽధించిన భాగాల ముద్దలను పోలీసులు గుర్తించినట్లు కూడా తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం