Share News

Forensic Analysis: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో సిబ్బంది కొరత

ABN , Publish Date - May 05 , 2025 | 04:38 AM

క్లిష్టమైన క్రిమినల్‌ కేసుల్లో.. ఫోరెన్సిక్‌ విశ్లేషణ అత్యంత కీలకం.. నేరస్థులకు కోర్టుల్లో శిక్ష పడాలంటే.. పోలీసుల దర్యాప్తుతోపాటు.. ఫోరెన్సిక్‌ నివేదికల ప్రాముఖ్యత అంతాఇంతా కాదు.

Forensic Analysis: ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లో సిబ్బంది కొరత

  • అందుబాటులో లేని సైంటిస్టులు.. పెండింగ్‌లో వేలాది కేసులు

  • దేశమంతటా ఇదే పరిస్థితి.. తెలంగాణలో మరీ దారుణం

  • రాష్ట్రంలో 91% మేర ఖాళీలు

  • బాధ్యతలకు డైరెక్టర్లు దూరం

  • ఐపీఎస్‌ల పర్యవేక్షణలో విభాగాలు

  • ఫోరెన్సిక్‌ సైన్స్‌కు విద్యార్థుల కొరత

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): క్లిష్టమైన క్రిమినల్‌ కేసుల్లో.. ఫోరెన్సిక్‌ విశ్లేషణ అత్యంత కీలకం..! నేరస్థులకు కోర్టుల్లో శిక్ష పడాలంటే.. పోలీసుల దర్యాప్తుతోపాటు.. ఫోరెన్సిక్‌ నివేదికల ప్రాముఖ్యత అంతాఇంతా కాదు..! రేప్‌ కేసుల్లో నిందితుల వీర్యకణాల విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షలు.. దొంగతనాలు/దోపిడీలు, హత్య కేసుల్లో వేలిముద్రల విశ్లేషణ, తూటా ఏ తుపాకీ నుంచి వచ్చిందో గుర్తించడం, నేరం చేసేందుకు నిందితులు ఉపయోగించిన వాహనం టైరు గుర్తు దొరికినా.. చివరికి నేరస్థుల తల వెంట్రుక, ఉమ్మి, లాలాజలం లభించినా.. కేసు మిస్టరీని ఛేదించడంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎ్‌ఫఎ్‌సఎల్‌) పాత్ర ఎనలేనిది..! ఇంటర్నెట్‌లో వెతికి మరీ.. పోలీసులకు చిక్కకుండా ఉండేలా నిందితులు నేరాలకు పాల్పడుతుంటే.. ‘కానూన్‌ కా హాఁథ్‌ లంబా హోతాహై’ అంటూ ఎఫ్‌ఎ్‌సఎల్‌ బృందాలు నిరూపించిన కేసులెన్నో..! అయితే.. అంతటి కీలకమైన ఎఫ్‌ఎ్‌సఎల్‌తోపాటు.. జిల్లా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో సిబ్బంది కొరతతో కేసులు పేరుకుపోతున్నాయి. కేంద్ర ఎఫ్‌ఎ్‌సఎల్‌ మొదలు.. జిల్లా స్థాయి వరకు దేశంలో మొత్తం 711 ల్యాబ్‌లు ఉండగా.. వాటిల్లో 50ు సిబ్బంది లేకపోవడం గమనార్హం..! దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లకు ఏటా 5 లక్షల దాకా కేసులు వెళ్తుండగా.. సిబ్బంది కొరత కారణంగా నివేదికల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దేశవ్యాప్తంగా.. తెలంగాణలో 91ు, బిహార్‌లో 85ు, ఉత్తరాఖండ్‌లో 80ు మేర ఫొరెన్సిక్‌ సైంటిస్టుల కొరత ఉన్నట్లు ఇటీవల విడుదలైన ‘ఇండియా జస్టిస్‌-2025’ నివేదిక స్పష్టం చేసింది.


ఈ పరీక్షలు కీలకం

క్రిమినల్‌ కేసులకు సంబంధించి బయాలజీ, సీరాలజీ, డీఎన్‌ఏ, టాక్సికాలజీ, కెమిస్ట్రీ, లిక్కర్‌, నార్కొటిక్స్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌, బాలిస్టిక్స్‌ వంటి పరీక్షలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీల్లో నిర్వహిస్తారు. పైన పేర్కొన్న పరీక్షలకు ఒక్కో విభాగానికి కనీసం ఒక నిపుణుడైన సైంటిస్టు సేవలు అవసరం. ఇవేకాకుండా.. ఫొటోగ్రఫీ, ఆర్‌ఎన్‌ఏ, సైబర్‌ ఫొరెన్సిక్‌ పరీక్షలకు కూడా నిపుణుల అవసరం ఉంటుంది. తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీలో కొన్నేళ్లుగా రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో భారీగా ఖాళీలు పేరుకుపోయాయి. పదవీ విరమణ చేసిన వారి స్ధానంలో ్త నియామకాలు చేపట్టకపోవడంతో వేల సంఖ్యలో ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదికలు పెండింగ్‌లో పడ్డాయి. గతంలో ఎఫ్‌ఎ్‌సఎల్‌కు డైరక్టర్లుగా సీనియర్‌ సైంటిస్టులను నియమించేవారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహదారుగా ఉన్న గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరక్టర్‌గా పనిచేసిన వారే..! ఆయన తర్వాత ఆ స్ధాయిలో సైంటిస్టులను డైరక్టర్లు చేయకుండా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు ఎఫ్‌ఎ్‌సఎల్‌ అదనపు బాధ్యత అప్పగిస్తూవస్తున్నారు.


ఒక అధికారి 4 పదవులు..

ప్రస్తుతం తెలంగాణ ఎఫ్‌ఎ్‌సఎల్‌కు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి షికాగోయల్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. వాస్తవానికి ఆమె సీఐడీ డీజీగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటు.. మహిళా భద్రత విభాగం, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, ఎఫ్‌ఎ్‌సఎల్‌కు ఇన్‌చార్జిగా ఉండడం గమనార్హం..! ఒక అధికారి నాలుగు కీలకమైన బాధ్యతలను నిర్వర్తించడం దాదాపు అసాధ్యమే..!


విద్యార్థుల వెనుకంజ.. భవిష్యత్‌ ఏమిటి?

ఫోరెన్సిక్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా నియమితులు అవ్వాలంటే బీఎస్సీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సు, లేదా బయాలజీ, జెనెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ విభాగాల నుంచి డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యత సాధిస్తే.. ఎఫ్‌ఎ్‌సఎల్‌కు సంబంధించిన డీఎన్‌ఏ విశ్లేషణ, టాక్సికాలజీ, బాలిస్టిక్‌ సైంటిస్టులు అవ్వవచ్చు. క్రిమినాలజీ కోర్సు పట్టా ఉన్నా సరే.. బీటెక్‌ విద్యార్ధులు అయితే సైబర్‌ ఫోరెన్సిక్‌ లేదా డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ కోర్సుల్లో చేరితే వీరికి సైబర్‌ క్రైం విభాగాల్లో పనిదొరకుతుంది. ఇన్ని అవకాశాలున్నప్పటికీ, సైన్స్‌ రంగానికి సంబంధించిన కోర్సుల్లో చేరడానికి విద్యార్థులు ముందుకు రాకపోవడంతో చాలా కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. చేరిన అతికొద్ది మంది సైన్స్‌ విద్యార్థులను ప్రైవేట్‌ రంగం ఎక్కువ జీతాలిచ్చి తమ వైపు తిప్పుకొంటోంది. దీంతో.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ల భవిష్యత్‌ ఏమిటనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీలను ప్రారంభించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఫోరెన్సిక్‌ విభాగాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ప్రతిపాదనకు మోక్షం లభించకపోవడంతో.. ఫోరెన్సిక్‌ విభాగాలు పోలీసు గొడుగు నీడలోనే పనిచేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 05:44 AM