Show Cause Notices: ఎఫ్సీఐలో షోకాజ్ నోటీసుల కలకలం
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:45 AM
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)లో అధికారులు, సాంకేతిక సిబ్బందికి జారీ చేసిన షోకాజ్ నోటీసులు కలకలం రేపుతున్నాయి. ప్రజా పంపిణీ కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన బియ్యంలో నాణ్యత లోపించిందని, నూకల శాతం
నాణ్యత లేకపోయినా సీఎంఆర్కు గ్రీన్సిగ్నల్
మిల్లర్లతో కొందరు అధికారులు మిలాఖత్
పొరుగు రాష్ట్రాల ఫిర్యాదులతో నోటీసులు
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)లో అధికారులు, సాంకేతిక సిబ్బందికి జారీ చేసిన షోకాజ్ నోటీసులు కలకలం రేపుతున్నాయి. ప్రజా పంపిణీ కోసం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన బియ్యంలో నాణ్యత లోపించిందని, నూకల శాతం ఎక్కువగా ఉందని, రంగు మారిపోయాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు హైదరాబాద్లోని ఎఫ్సీఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల్లోని గోదాముల నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యాయి. రైస్ మిల్లర్లు ఇచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను తూతూమంత్రంగా పరిశీలించి, గ్రీన్సిగ్నల్ ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్లు, మేనేజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. సంజాయిషీ ఇచ్చే పనిలో వారు నిమగ్నమయ్యారు. సాధారణంగా ఒక టెక్నికల్ అసిస్టెంట్ పాస్ చేసిన బియ్యంలో నాలుగో వంతును మేనేజర్ తిరిగి పరీక్షించాలి. అప్పుడే సీఎంఆర్ బియ్యం గోదాముల్లోకి చేరాలి. ఆ తర్వాత కేంద్రం ఇచ్చే ఇండెంటుకు అనుగుణంగా రైల్వే వ్యాగన్లు లోడ్ చేసి ఇతర రాష్ట్రాలకు పంపించాలి.
కానీ, ఎఫ్సీఐ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, రైస్ మిల్లర్లతో మిలాఖత్ అయి ఇష్టారాజ్యంగా బియ్యం పాస్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాకు తెలంగాణ నుంచి ఎఫ్సీఐ పంపించిన బియ్యం నాణ్యత లేవని, నిజామాబాద్ జిల్లాలోని గొడౌన్లలో రైస్ మిల్లర్లు ఎలా ఇస్తే అలా సీఎంఆర్ బియ్యం తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. వీటితో పాటు పలు జిల్లాల్లో ఎఫ్సీఐ గోదాముల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, ఫ్యూమిగేషన్ సరిగా చేయకపోవటం, బస్తాల మధ్యలో పద్ధతి ప్రకారం మందు గోలీలు ఉంచకపోవటం, కొన్నిచోట్ల పురుగులు పట్టి దెబ్బతిన్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ మొదలుపెట్టారు. రైస్ మిల్లర్లు ఇచ్చిన సీఎంఆర్ యథాతథంగా పాస్ చేసి, గోదాములకు తరలించినచోటే సమస్యలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించినచోట రావటంలేదు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 5నుంచి 10 మంది వరకు షోకాజ్ నోటీసులు అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News