Adilabad: లోయలో పడిన వాహనం ఒకరి మృతి.. 59 మందికి గాయాలు
ABN , Publish Date - Jan 20 , 2025 | 05:12 AM
ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా కొత్తపల్లి ఘాట్రోడ్డులో ఘటన
రిమ్స్, ఉట్నూర్ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు
నార్నూర్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు. ఇందులో తీవ్ర గాయాలైన 40 మందిని ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని ఆదిలాబాద్లోని రిమ్స్, నార్నూర్ ఆస్పత్రుల్లో చేర్చారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామానికి చెందిన 60 మంది ఆదివాసీ భక్తులు ఐచర్ వాహనంలో ఆదివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి బయలుదేరారు.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి (హెచ్)-మల్కుగూడ వద్ద ఉన్న ఘాట్ రోడ్డులో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా పడి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలో ఉన్న 59 మందికి గాయాలయ్యాయి. ఇందులో తీవ్రంగా గాయపడిన 40 మందిని ఉట్నూర్ ఆస్పత్రికి, మిగతా వారిని ఆదిలాబాద్లోని రిమ్స్, నార్నూర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రిమ్స్లో చికిత్స పొందుతూ కుమ్రం మాల్కు(62) చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నార్నూర్ సీఐ రహీం పాషా తెలిపారు.