ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 79.20 కోట్లు ఎస్బీఐకి అప్పగింత
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:54 AM
ముసద్దీలాల్ జువెలర్స్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన చరాస్తుల్లో రూ. 79.20 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ)కి అప్పగించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ముసద్దీలాల్ జువెలర్స్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన చరాస్తుల్లో రూ. 79.20 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ)కి అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తిచేశారు. పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు మరికొందరిపై ఈడీ హైదరాబాద్ జోనల్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్(పీఎంఎల్ఏ) చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా ముసద్దీలాల్ జువెలర్స్కు సంబంధించిన స్థిర, చర ఆస్తుల్ని ఈడీ అధికారులు జప్తు చేశారు.
అయితే ముసద్దీలాల్ జువెలర్స్ నిర్వాహకులు ఎస్బీఐ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. 2019 జూలై నుంచి ఆ రుణాలు ఎన్పీఏగా మారాయి. ఆ సంస్థ ఎస్బీఐకి మొత్తం 120 కోట్లు బకాయి పడింది. దీంతో నాంపల్లి పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టును బ్యాంకు అధికారులు ఆశ్రయించారు. విచారణ అనంతరం ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో 79.20 కోట్లు ఎస్బీఐకి మళ్లించేలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.