Shanta Vasantha Trust: సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:34 AM
సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని వక్తలు అన్నారు. డా. వరప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని శాంతా వసంతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
శాంతా వసంతా ట్రస్ట్ పురస్కారాల ప్రదానోత్సవంలో వక్తలు
హైదరాబాద్ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని వక్తలు అన్నారు. డా. వరప్రసాద్ రెడ్డి నేతృత్వంలోని శాంతా వసంతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. సాహిత్యం, కళలు, సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందిస్తున్న డా. వరప్రసాద్ కృషిని కొనియాడారు. మాతృభాషలో విద్యను అభ్యసించిన వారే తమ రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను అలవరచుకుంటారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా వయోలిన్ విద్వాంసుడు, పద్మశ్రీ అన్నవరపు రామస్వామికి ఆయన చేతుల మీదుగా సంగీతరత్న పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ రచయిత, కవి ఓలేటి పార్వతీశంను ఉత్తమ సాహితీవేత్త అవార్డుతో సత్కరించారు. ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత ధూపాటి విజయకుమార్కు ఉత్తమ సాహితీ సేవారత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం డా. వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... సాధారణ వ్యక్తులను సైతం సంస్కార వంతులుగా తీర్చిదిద్దే శక్తి సంగీత, సాహిత్యాలకు ఉందని.. సాహితీవేత్తలు, కళాకారులను గౌరవించడం తమ బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎంబీఎస్ ప్రసాద్, కార్యదర్శి తొడుపునూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News