Jubilee Hills Byelection: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం ఇదే
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:03 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
తెలంగాణ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. నవీన్ యాదవ్ యూసుఫ్ గూడ నుంచి నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీగా వెళ్లారు. ర్యాలీకి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర ముఖ్య నేతలు తరలివచ్చారు.
ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్(Naveen Yadav) పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అలానే బీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత(Maganti Sunitha ) బరిలో నిలిచారు. ఈ ముగ్గురు జూబ్లీహిల్స్(Jubilee Hills Bypoll) నియోజకవర్గం స్థానికులు కావడంతో ఉపఎన్నిక ఆసక్తికరంగా మారింది. మాగంటి సునీత మినహా మిగిలిన ఇద్దరు అభ్యర్థులు గత కొన్ని ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే స్థానికంగా ఈ ముగ్గురికి గట్టి పట్టుంది.
నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం:
హైదరాబాద్ లోని యూసఫ్గూడకు చెందిన వ్యక్తి నవీన్ యాదవ్. ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పొందారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సిటీలో పేరున్న సోషల్ వర్కర్. నవీన్ యాదవ్ తొలిసారి 2014లో మజ్లిస్ పార్టీ(MIM) తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేవలం 9 వేల పైచిలుకు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. 2018లో ఇక్కడి నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి..భారీగానే ఓట్లు సంపాదించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్.. నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్నారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో ముచ్చటగా మూడోసారి జూబ్లీహిల్స్(Jubilee Hills Bypoll) బై పోల్ లో పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే దృఢ నిశ్చయంతో నవీన్ యాదవ్(Naveen Yadav) ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ త్రోబాల్ అసోషియేషన్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఎంఐఎం మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. నువ్వు గెలవాలి.. అభివృద్ధి చేయాలంటూ నవీన్కు ఎంఐఎం సూచించింది.