CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:48 AM
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

నేడు నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాలలో పర్యటన
హైదరాబాద్/నిజామాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్కు చేరుకుని అక్కడి ప్రచార సభలో పాల్గొననున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని అక్కడి ప్రచార సభలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఈ మూడు జిల్లాల్లో సభలను ఆయా జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ సైతం దిగనుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.