Share News

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:54 AM

రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల్లో మోదీ ప్రభుత్వం నుంచి సహకారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

  • వివిధ ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులివ్వండి

  • కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు సీఎం వినతి

  • హైదరాబాద్‌ బస్సుల్ని ఈ-మోడల్లోకి మారుస్తాం

  • దీనికి సహకరించండి.. కుమారస్వామికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల్లో మోదీ ప్రభుత్వం నుంచి సహకారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను మంజూరు చేయాలని కేంద్రంలో ఆ శాఖ మంత్రి అయిన భూపేందర్‌ యాదవ్‌కు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రాష్ట్రంలో 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టం అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుల్లో ఎక్కువగా మారుమూల ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఇందిరా పర్యావరణ్‌ భవన్‌లో భూపేందర్‌తో సీఎం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. భేటీ సందర్భంగా సీఎం పలు అంశాలన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎ్‌సవై, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని సీఎం తెలిపారు.


గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వినతులకు భూపేందర్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌లో తిరిగే వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్‌ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిసి రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. కుమారస్వామి కార్యాలయానికి వెళ్లి ఆయనతో సీఎం భేటీ అయ్యారు. పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద జీసీసీ పద్థతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీజిల్‌ బస్సులకు ఎలక్ట్రిక్‌ కిట్‌ అమర్చి రిట్రో ఫిట్మెంట్‌ పద్థతిలో ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. హైదరాబాద్‌కు కేంద్రం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్‌ మోడల్‌ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కార్యాలయానికి వెళ్లిన సీఎం, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం, పొంగులేటి, ఎంపీలు బలరాంనాయక్‌, రఘువీర్‌రెడ్డి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్‌సీ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 03:54 AM