Bhatti Vikramarka: ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రాత్మకం
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:46 AM
రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
55 సమీకృత గురుకులాలకు 11 వేల కోట్ల కేటాయింపుపై ఉపముఖ్యమంత్రి భట్టి
నిధుల మంజూరుపై మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, పొంగులేటి హర్షం
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 పాఠశాలలకు నిధులు కేటాయిస్తూ విద్యాశాఖ ద్వారా శనివారం జారీ చేయించిన ఉత్తర్వులను విలేకరులకు చూపిస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకే సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. దేశంలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా ఈ గురుకులాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే పాఠశాలలో తరగతి గదులతోపాటు అద్భుతమైన క్రీడా ప్రాంగణం, గ్రంథాలయం, ల్యాబ్లు, డిజిటల్ తరగతుల నిర్వహణకు అవసరమైన వసతులు ఉంటాయని భట్టి చెప్పారు.
అలాగే, ఉపాధ్యాయులకు కూడా గృహ సముదాయం ఉంటుందని వివరించారు. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే విధంగా సిలబస్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. సామాజిక మార్పు అంశంలో తమ నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రజాప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుందని భట్టి వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం పోగేస్తున్న ప్రతి పైసాను ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మాత్రమే వినియోగిస్తున్నామని భట్టి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, సమీకృత గురుకులాలకు నిధులు కేటాయింపుపై బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం హుస్నాబాద్లో యంగ్ ఇండియా సమీకృత గురుకులం ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here