Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు
ABN , Publish Date - Feb 22 , 2025 | 10:19 AM
గతంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు కొంతమంది చేశారు కానీ, తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి సారిగా హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్బీఓటీ)ని అందుబాటులోకి తీసుకువచ్చింది రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్.

- నగరంలో అందుబాటులోకి ఆక్సిజన్ థెరపీ చాంబర్
-100% ఆక్సిజన్ను పీల్చుకునే అవకాశం
- కాలుష్యకాలంలో ఆరోగ్య ప్రదాయిని అంటున్న ఫిజికల్ థెరపిస్ట్లు
కాలుష్య నగరంలో స్వచ్ఛమైన గాలి చాలా మందికి అందని ద్రాక్షగానే మారింది. ఇప్పటికే ఢిల్లీలో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. అదే దారిలో హైదరాబాద్(Hyderabad) కూడా పయనిస్తుందని కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న కాలుష్య కారక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాగేనీటిని కొనుక్కుంటున్నాము. రాబోయే రోజుల్లో పీల్చేగాలినీ కొనుక్కోవాల్సిందేనేమో అని కొందరు ఆందోళన చెందుతూ ఉంటారు. ఎప్పటి వరకో ఎందుకు అన్నట్లుగా నగరంలో ఆక్సిజన్ చాంబర్స్ వస్తున్నాయి. అరగంట పాటు స్వచ్ఛమైన గాలి(ఆక్సిజన్) కోసం రూ. 5వేలు వసూలు చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఫిజికల్ థెరపి్స్టలు చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ప్రేమించలేదని టీచర్ కిడ్నాప్..
హైదరాబాద్ సిటీ: గతంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు కొంతమంది చేశారు కానీ, తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి సారిగా హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్బీఓటీ)ని అందుబాటులోకి తీసుకువచ్చింది రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్. 100శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఫ్రెషరైజ్డ్ చాంబర్లో అందించడం తమ ప్రత్యేకత అని అంటున్నారు జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని రాస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో ఫిజికల్ థెరపిస్ట్ సయ్యద్ ఖలీల్. సాధారణ వాతావరణంలో మనం పీల్చే గాలిలో 20శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. దానిలో 15శాతం మళ్లీ మనం బయటకు వదిలివేస్తాం.
అంటే మన శరీరం వాడుకునేది కేవలం 5శాతం మాత్రమే. అదే తమ హెచ్బీఓటీ చాంబర్లో నూరుశాతం ఆక్సిజన్ ఉంటుందని, శరీరం ఆ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల కొల్లాజన్ ప్రేరేపితమవుతుందంటున్నారు ఆయన. దీనివల్ల ముడతలు తగ్గుతాని, వయసు ప్రభావం నెమ్మదిస్తుందని చెబుతున్నారు. ‘హెచ్బీఓటీ అనేది కోత అవసరం లేని ఓ చికిత్స. మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు 100శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ సరఫరా చేసే ఈ చాంబర్లో నిర్దిష్ట సమయం ఉంటే సరిపోతుంది. ఆక్సిజన్ పూర్తిగా అందడం వల్ల కణజాలం త్వరగా శక్తిని పుంజుకుంటుంది. మధుమేహులకు డయాబెటిక్ న్యూరోపతి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. క్యాన్సర్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. న్యూరో డీజనరేటివ్, జ్ఞాపక శక్తి, ఒత్తిడి సమస్యలను కూడా తగ్గిస్తుంది’ అని వివరించారు.
అందరికీ ఒకటే పద్ధతి ఉండదు
హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ ఇప్పుడు వైద్య చికిత్సలలో ఒక విప్లవంగానే చెప్పాల్సి ఉంటుందంటున్నారు ఖలీల్. నాడీ, జీవక్రియ ఆరోగ్యానికి ఇది మద్దతు అందిస్తుందన్న ఆయన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. అలాగని అందరికీ ఒకే తరహా చికిత్స పనికిరాదంటూ, ఓ వ్యక్తి ఆరోగ్య స్థితి, వారి అవసరాలను పరిగణనలోకి తీసుకుని అరగంట నుంచి 2 గంటల పాటు 100శాతం ఆక్సిజన్ అందిస్తామంటున్నారు.
ఏకధాటిగా ఆక్సిజన్ను అందించడం వల్ల ఆరోగ్య సమస్యలేవీ ఉండవా అంటే.. తాము హాస్పిటల్ వాతావరణంలో ముక్కుకు మాస్క్ పెట్టి ఆక్సిజన్ పంప్ చేయడం లేదని, స్వచ్ఛమైన ఆక్సిజన్ నిండిన చాంబర్లో తమంతట తాముగా గాలి పీల్చుకునే అవకాశం కల్పిస్తుండటం వల్ల సమస్యలేవీ రావని వెల్లడించారు. ఒక్కో సెషన్కు అంటే కనీసం అరగంట సెషన్కు ఐదువేల రూపాయల నుంచి చార్జీలు మొదలవుతాయని, వినియోగించుకునే సమయం, వారి ఆరోగ్య స్థితిని అనుసరించి ధరలు మారుతుంటాయని వివరించారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News