Karimnagar: నీది ఏ పార్టీ?
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:44 AM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్సలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష రసాభాస
సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్న
కౌశిక్.. నీది ఏ పార్టీ అంటూ నిలదీత
రాజీనామా చేసి గెలవాలని సవాల్
నువ్వే పార్టీ నుంచి వచ్చావన్న సంజయ్
కరీంనగర్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్సలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఆదివారం జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు తెలపాలని ఇన్చార్జి మంత్రి కోరారు. ఈ క్రమంలో సంజయ్కుమార్ (జగిత్యాల) మాట్లాడడానికి మైకు తీసుకోగా కౌశిక్రెడ్డి (హుజూరాబాద్) అభ్యంతరం చెబుతూ ఆయన (సంజయ్కుమార్) ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఎందుకు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారని అగ్రహంగా ప్రశ్నించారు.
ఆయనపైకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దానికి సంజయ్కుమార్ దీటుగా స్పందించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. ‘నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు’ అంటూ కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్భంలో మాటా మాట పెరిగి ఒకరిని ఒకరు తోసివేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకువెళ్లారు. గేటు బయటే నిలబడిన ఆయన ‘సిగ్గూ.. లజ్జ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవమ’ని సంజయ్ కుమార్కు సవాల్ విసిరారు. సమావేశంలో కౌశిక్రెడ్డి వ్యవహరించిన తీరుపై మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారం సరిగా లేదని... మార్చుకోవాలని హెచ్చరించారు. తనను విమర్శించడానికి రాజీనామా చేయమని అడగడానికి కౌశిక్ రెడ్డికి ఎలాంటి అధికారం లేదని సంజయ్కుమార్ అన్నారు. ఆయనపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
అచ్చోసిన ఆంబోతులా కౌశిక్ రెడ్డి: బల్మూరు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అచ్చోసిన ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ధ్వజమెత్తారు. మీడియాలో కనపడేందుకే పిచ్చిచేష్టలు చేస్తున్నాడని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే రోడ్డుపై గుడ్డలూడదీసి కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.
సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా: ఉత్తమ్
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి పంట వేసినా వేయక పోయినా రైతు భరోసా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రోడ్లు, రియల్ ఎస్టేట్ స్థలాలు, సాగుకు యోగ్యం కాని భుములకు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామన్నారు. అర్హులరందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందన్నారు. వచ్చే నెల నుంచి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకుండానే రాష్ట్ర వ్యాప్తంగా 66.7 లక్షల ఎకరాల్లో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితరులు పాలొన్నారు.
పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడు అన్నీ మర్చిపోయారా?: కౌశిక్ రెడ్డి
‘పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశాడు.. ఫార్చునర్లు, ఇన్నోవాలు ఇచ్చాడు.. పోలీస్ స్టేషన్లను ఆధునీకరించాడు.. జీతాలు పెంచాడు.. అన్ని మరిచిపోయారా’.. అని పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. జిల్లా సమీక్షా సమావేశ మందిరం నుంచి బయటకొచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాకతప్పదని, ఎక్స్ట్రాలు చేస్తున్న అధికారులు ఎవర్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పార్టీ మారిన వారు, రాజీనామా చేయని వారిని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.