BJP BC Reservation Telangana: బీజేపీది బీసీ వ్యతిరేక నైజం
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:24 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదనే బీజేపీ వ్యాఖ్యలతో ఆ పార్టీ ..
బీసీలకు రిజర్వేషన్ల పెంపు తమిళనాడులో సాధ్యమైనప్పుడు ఇక్కడెందుకు కాదు: పొన్నం
బీసీలపై బీజేపీ కుట్రలు: ఆది శ్రీనివాస్
బీజేపీ వైఖరేంటో 48గంటల్లో తేల్చాలి: జాజు
హైదరాబాద్, జూలై 22(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదనే బీజేపీ వ్యాఖ్యలతో ఆ పార్టీ బీసీ వ్యతిరేక నైజం బయటపడిందని పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే రిజర్వేషన్లు ఎందుకు అమలు కావో చూస్తామని సవాల్ విసురుతున్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. గతంలో తమిళనాడులో రిజర్వేషన్ల పెంపుదల సాధ్యమైనపుడు తెలంగాణలో ఎందుకు కాదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సర్వే అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొంది.. ఢిల్లీలో ఉందని, దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, బరాబర్ అధికారికంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించాలని పొన్నం కోరారు.
సొంత పార్టీని ఒప్పించలేకే..: ఆది
మైనారిటీ రిజర్వేషన్లను అడ్డంపెట్టి బీసీలకు అన్యాయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. రామచందర్రావు సొంత పార్టీని ఒప్పించడం చేతకాక కాంగ్రె్సపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీ దొంగనాటకాన్ని బీసీలు గమనించాలని, ఆ పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్తో పాటు ఆ పార్టీ బీసీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
రామచందర్రావు బీసీ వ్యతిరేకి: ఐలయ్య
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు రాష్ట్రంలో మొసలికన్నీరు కారుస్తూ ఢిల్లీ వెళ్లి బీసీ వ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. రాష్ట్రం నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలు గెలిచి రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారని, బీసీ బిల్లును కేంద్రానికి పంపితే పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ఎంపీలు చేతకాని దద్దమ్మలుగా మారిపోయారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ఆర్డినెన్స్ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయన్నారు.
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: చనగాని
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగానే కేంద్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వదని రామచందర్రావుతో చెప్పించారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ విమర్శించారు. గత మూడు నెలలుగా కేంద్ర క్యాబినెట్లో 7 బిల్లులకు ఆమోదం తెలిపారని, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లు ఎందుకు చర్చకు రాలేదని ప్రశ్నించారు. రామచందర్రావు ఓబీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ వైఖరి ఏమిలో 48 గంటల్లో తేల్చాలి: జాజుల
కవాడిగూడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు బీసీలపై విషం కక్కారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీసీ సంఘాల నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇచ్చారని, ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యతిరేకించడం దేనికి సంకేతమని జాజుల ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ 48 గంటల్లో తన వైఖరిని స్పష్టం చేయకపోతే ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్డడిస్తామన్నారు. బీసీ సంఘాల ఐక్య వేదిక చైర్మన్ కుందారం గణేషాచారి, బీసీ సంఘం నాయకులు కుల్కచర్ల శ్రీనివాసు ముదిరాజ్, విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి: శంకర్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీని అమలు చేయలేక బీజేపీపై నిందలు వేస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్ఖఢ్ రాజీనామా వెనుక నితీష్ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి