స్థానిక ఎన్నికల్లో.. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:06 AM
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.

బీసీ కుల సంఘాలు, నాయకుల డిమాండ్
పంజాగుట్ట, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడారు.
సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొండి చేయి చూపితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, వాదనలు వినిపించాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్, రాజకీయ పార్టీల పదవుల్లో 50 శాతం బీసీలకు ఇవ్వాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.