Share News

Bandi Sanjay: క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం

ABN , Publish Date - Feb 22 , 2025 | 05:02 AM

లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు.

Bandi Sanjay: క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం

  • 50 వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్‌ స్కెచ్‌

  • ఉచిత ఎల్‌ఆర్‌ఎస్‌ హామీ ఏమైంది?

  • కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత

  • ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి

  • పంపిస్తే వెనక్కి పంపుతాం: బండి సంజయ్‌

పెద్దపల్లి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట పైసలు ఎవరూ చెల్లించొద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలిచ్చిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని నిలదీశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాల్సిందేనని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా సంజయ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌, సీతక్క తదితరులు మాట్లాడిందేంటి?.. ఇప్పుడు చేస్తున్నదేంటి అని నిలదీశారు. ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే.. తిరిగి వెనక్కి పంపుతామని, ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్‌ కోసం బిల్లు పంపితేనే మీరు, మేము కలిసి కేంద్రాన్ని ఒప్పిద్దాం అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 3.95 కోట్ల మందికి ఆధార్‌ కార్డులున్నాయని, మరో 20 నుంచి 25 లక్షల మందికి జారీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాంటిది కులగణన సర్వేలో జనాభా 3.70 కోట్లకు ఎలా తగ్గిందని, ఇంకా 60 లక్షల మంది ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 14 నెలలైనా ఉద్యోగులకు పీఆర్‌సీ వేయలేదని, కేంద్ర ప్రభుత్వం ఐదు డీఏలు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పదవీ విరమణ పొందిన వారికి డబ్బులు ఇచ్చేందుకు 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు నెలకు రూ.1000 కోట్ల బిల్లులు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం రూ.300 కోట్లకు సీలింగ్‌ విధించిందని, మిగిలినవి ఎవరిస్తారని ప్రశ్నించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. నిరుద్యోగ భృతికి దిక్కే లేదని, ఒక్కో నిరు ద్యోగికి రూ.56 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,500 కోట్లు పెండింగులో ఉన్నాయని, 15ు కమీషన్లు ఇస్తేనే ఆరోగ్యశ్రీ బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లపై కాంగ్రెస్‌ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ చేశారు.


ఎల్‌ఆర్‌ఎ్‌సపై జీవో లోపభూయిష్టం: పాల్వాయి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో లోపభూయిష్టంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. ఈ జీవో అక్రమార్కులకు కొమ్ముగాసేలా ఉందని విమర్శించారు. ఇందిరమ్మ పాలన అంటే అక్రమ లేఅవుట్‌లను సక్రమం చేయడమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం హరీశ్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్‌ నాయకులు.. ఇప్పుడు అంతకంటే దారుణంగా అక్రమార్కులకు కొమ్ముగాస్తున్నారని మండిపడ్డారు. నో ఎల్‌ఆర్‌ఎస్‌, నో బీఆర్‌ఎస్‌ అని నాడు కాంగ్రెస్‌ నాయకులు అన్నారని.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నో ఎల్‌ఆర్‌ఎస్‌, నో కాంగ్రెస్‌ అంటున్నారన్నారు. అడ్డగోలు వసూళ్ల కోసమే తాజా జీవో అని హరీశ్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోపైనే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, కొత్త జీవో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

Updated Date - Feb 22 , 2025 | 05:02 AM