Raghuram Rajan on AI: ఏఐతో ఉద్యోగాల కోతలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:18 PM
ఏఐతో కొన్ని జాబ్స్ ప్రభావితం కావని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కానీ ఈ ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలు విద్యావ్యవస్థ అందించేలా సంస్కరణలు తీసుకురావాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ వినియోగం పెరిగే కొద్దీ భవిష్యత్తు ఉద్యోగాల తీరుతెన్నులపై ఆందోళన పెరుగుతోంది. ఇప్పుడున్న అనేక ఉద్యోగాలు భవిష్యత్తులో కనుమరుగు అవుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఉద్యోగాలకు ఏఐతో ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు (Raghuram Rajan On AI Impact on Jobs).
ఏఐతో ప్రస్తుతానికి భర్తీ చేయలేని ఉద్యోగాలు కొన్ని ఉన్నాయని ఓ పాడ్కాస్ట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ తెలిపారు. ప్లంబింగ్, ఎయిర్క్రాఫ్ట్ మరమ్మతులు వంటి ఉద్యోగాల ఆటోమేషన్ ప్రభావానికి ఇప్పుడప్పుడే లోనుకావని అన్నారు. అయితే, వీటికి కావాల్సిన నైపుణ్యాలు ప్రస్తుత విద్యావిధానం ద్వారా స్టూడెంట్స్కు అందడం లేదని అన్నారు. సరైన శిక్షణ లేని శ్రామికశక్తితో భారత్ ఏఐ జమానాలో కాలుపెడుతోందని అన్నారు.
విద్యావిధానంలో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఒక ప్లంబర్కు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు వ్యాపారపరమైన మెళకువలు కూడా ఉండాలని అన్నారు. విద్యార్థులు నేర్చుకునే పాఠ్యాంశాలు కేవలం థియరీకే పరిమితం కాకుండా నిజజీవితంలో వాటి అన్వయంపై కూడా పట్టు ఉండాలని అన్నారు. ఈ దిశగా విద్యావిధానంలో సంస్కరణలు రావాలని అన్నారు.
ఇక ఈ అంశంపై ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏఐ వినియోగంలో ముందున్న వారిదే భవిష్యత్తు అని అన్నారు. ప్రస్తుతం ఏఐ వినియోగాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తోంది విద్యుత్ సరఫరా సామర్థ్యమేనని అన్నారు. భారత్లో వచ్చే నాలుగు ఏళ్లల్లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించినట్టు ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.