Share News

Badminton World Championship 2025: సాత్విక్‌ జోడీ మళ్లీ సాధించింది

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:56 AM

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు పతకం ఖాయమైంది. డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ చిరాగ్‌ షెట్టి సెమీఫైనల్‌కు దూసుకు పోయింది. దాంతో మనకు కనీసం కాంస్య పతకం లభించనుంది....

Badminton World Championship 2025: సాత్విక్‌ జోడీ మళ్లీ సాధించింది

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప

సెమీఫైనల్‌ చేరికతో భారత్‌కు పతకం

క్వార్టర్స్‌లో మలేసియా జంటకు షాక్‌

పారిస్‌: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు పతకం ఖాయమైంది. డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి సెమీఫైనల్‌కు దూసుకు పోయింది. దాంతో మనకు కనీసం కాంస్య పతకం లభించనుంది. శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో తెలుగు కుర్రాడు సాత్విక్‌/చిరాగ్‌ (ముంబై) ద్వయం 21-12, 21-19తో చిరకాల ప్రత్యర్థి, మలేసియాకు చెందిన వరల్డ్‌ నెం.3 జంట ఆరొన్‌ చియా/సో వూ యిక్జ్‌జీ షాకిచ్చింది. గత ఏడాది ఇదే మలేసియా జోడీ చేతిలో క్వార్టర్‌ ఫైనల్‌ ఓటమితో పారిస్‌ ఒలింపిక్స్‌ పతకాన్ని సాత్విక్‌ జంట మిస్సవడం గమనార్హం. ఈ విజయంతో ఆ పరాజయానికి భారత ద్వయం ప్రతీకారం తీర్చుకుంది. ఇక.. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సాత్విక్‌/చిరాగ్‌కు వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఇది రెండో పతకం కావడం విశేషం. 2022 టోర్నీలో ఈ జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో పీవీ సింధు (ఓ స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్‌ (ఓ రజతం, ఓ కాంస్యం) తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రపంచ పతకాలు నెగ్గిన భారత షట్లర్లుగా సాత్విక్‌, చిరాగ్‌ రికార్డు సృష్టించారు. అంతేకాదు.. సాత్విక్‌ ద్వయం సెమీస్‌ చేరికతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 2011 నుంచి కనీసం ఒక పతకం గెలుస్తూ వచ్చిన భారత సంప్రదాయాన్ని కొనసాగించి నట్టయింది. సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం సెమీఫైనల్లో చైనాకు చెందిన 11వ సీడ్‌ చెన్‌ బో యాంగ్‌/లియు యి జంటతో తలపడనుంది. ఇక క్వార్టర్‌ఫైనల్‌ పోరులో...తొలి గేమ్‌లో 4-2 ఆధిక్యంలో నిలిచిన భారత జంట ఆపై 9-3తో ముందుకెళ్లి, విరామానికి 11-5తో నిలిచింది.


ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన సాత్విక్‌/చిరాగ్‌ గేమ్‌ను చేజిక్కించుకుంది. రెండో గేమ్‌లో భారత జోడీకి ఎదురు లేకపోయింది. సాత్విక్‌ పదునైన సర్వీ్‌సలు, చిరాగ్‌ బ్యాక్‌కోర్ట్‌ స్మాష్‌లకు రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేతలైన చియా/సో కుదేలయ్యారు. ఇదే జోరులో భారత జోడీ 17-12తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. చివర్లో 18-19తో మలేసియా జంట పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసినా ఒత్తిడి దరిచేరనీయని సాత్విక్‌/చిరాగ్‌.. ఆ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. కాగా, పురుషుల డబుల్స్‌ మరో సెమీఫైనల్లో కొరియాకు చెందిన సియో సంగ్‌ జె/కిమ్‌ వోన్‌ హో ద్వయం 21-13, 21-2తో డెన్మార్క్‌ జంట కిమ్‌ ఆస్ట్రప్‌/స్కారప్‌ రాస్‌ముసెన్‌పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2025 | 05:56 AM