Yash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాళ్కు కొత్త చిక్కులు.. మరో యువతి వేధింపుల ఆరోపణలు
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:55 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ పై మరో సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ఓ టీనేజ్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్(Yash Dayal)పై వస్తున్న వరుస ఆరోపణలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఐపీఎల్ 2025 సీజన్లో జైపూర్లో జరిగిన ఒక సంఘటనతో పాటు, గత రెండేళ్లుగా ఒక టీనేజ్ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇవి యశ్ దయాళ్ కెరీర్ను మాత్రమే కాకుండా, ఆర్సీబీ జట్టు ఇమేజ్ను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అంతకుముందు, గాజియాబాద్లో ఒక మహిళ ఆయనపై లైంగిక దాడి ఆరోపణలు చేసింది.
జైపూర్లో సంచలన ఆరోపణలు
జైపూర్లోని సంగనేర్ పోలీస్ స్టేషన్లో ఒక టీనేజ్ అమ్మాయి యశ్ దయాళ్పై ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం, యశ్ తనకు ప్రొఫెషనల్ క్రికెట్లో కెరీర్ను నిర్మించడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేసి, గత రెండేళ్లుగా ఆమెను భావోద్వేగంగా బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది. ఈ ఆరోపణలు ఓ నివేదికలో వెల్లడయ్యాయి.
విసిగిపోయిన ఆమె
ఆ అమ్మాయి యశ్ను క్రికెట్ ఆడుతున్నప్పుడు కలిసిందని, రెండేళ్ల క్రితం అతను తన కెరీర్లో సహాయం చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఐపీఎల్ 2025 సీజన్లో జైపూర్లోని సీతాపురలోని ఒక హోటల్కు ఆమెను పిలిచి మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.
17 ఏళ్ల వయసులోనే..
నిరంతర భావోద్వేగ బ్లాక్మెయిల్, దోపిడీతో విసిగిపోయిన ఆమె, చివరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆమె 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆరోపించడంతో, ఈ కేసు POCSO (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్) చట్టం కింద నమోదు చేయబడింది. ఒకవేళ యశ్ దోషిగా తేలితే, కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అంతేకాదు జరిమానా కూడా విధించవచ్చు.
గతంలో ఏం జరిగింది?
ఈ జైపూర్ కేసుకు ముందు, యశ్ దయాళ్ గాజియాబాద్లో మరో లైంగిక దాడి కేసులో చిక్కుకున్నాడు. ఈ నెల ప్రారంభంలో గాజియాబాద్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం, యశ్ ఆమెను ఐదేళ్లపాటు లైంగికంగా మోసం చేశాడని తెలిపింది. ఈ కేసు జులై 6న భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద నమోదు చేయబడింది.
ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు యశ్ దయాళ్కు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. జస్టిస్ సిద్ధార్థ్ వర్మ, అనిల్ కుమార్ల బెంచ్ ఈ కేసు తదుపరి విచారణ వరకు యశ్ అరెస్టును నిలిపివేసింది. ఈ రెండు కేసులు యశ్ దయాళ్ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపునున్నాయి.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి