Share News

ఢిల్లీ.. కాచుకో

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:07 AM

అదిరే ఆటతో ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో విజృంభించిన హర్మన్‌ సేన 47 పరుగుల తేడాతో ఘనవిజయం...

ఢిల్లీ.. కాచుకో

  • ఫైనల్లో ముంబై ఇండియన్స్‌

  • సివర్‌, మాథ్యూస్‌ హాఫ్‌ సెంచరీలు

  • ఎలిమినేటర్‌లో గుజరాత్‌ చిత్తు

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌

ముంబై: అదిరే ఆటతో ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో విజృంభించిన హర్మన్‌ సేన 47 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. దీంతో శనివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 77), హేలీ మాథ్యూస్‌ (50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77), కెప్టెన్‌ హర్మన్‌ (12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. గిబ్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్‌ 19.2 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది. గిబ్సన్‌ (34), లిచ్‌ఫీల్డ్‌ (31), భారతి (30) మాత్రమే రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మాథ్యూ్‌సకు మూడు, అమెలియాకు రెండు వికెట్లు దక్కాయి.


నిలకడలేమితో..: భారీ ఛేదనలో గుజరాత్‌ పూర్తిగా తేలిపోయింది. ముంబై బౌలర్ల జోరుకు ఓపెనర్‌ బెత్‌ మూనీ (6), హర్లీన్‌ (8), కెప్టెన్‌ గార్డ్‌నర్‌ (8) తొలి ఆరు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరడం ప్రభావం చూపింది. అయితే మరో ఓపెనర్‌ గిబ్సన్‌తో పాటు మిడిలార్డర్‌లో భారతి ఫుల్మలి, లిచ్‌ఫీల్డ్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ సరైన సమయంలో వీరిని పెవిలియన్‌కు చేర్చడంలో ముంబై సఫలమైంది. 15వ ఓవర్‌లో సిమ్రన్‌ 4,4,6.. తర్వాతి ఓవర్‌లో ఫుల్మలి 4,4తో గుజరాత్‌ 8 బంతుల్లోనే 27 పరుగులు సాధించి కాస్త ఉత్కంఠ పెంచింది. కానీ పుల్మలిని మాథ్యూస్‌ అవుట్‌ చేయడంతో ఇక జెయింట్స్‌ కోలుకోలేదు.

బాదుడే బాదుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగింది. ఆరంభంలో ఓపెనర్‌ మాథ్యూ్‌స-నాట్‌ సివర్‌ జోడీ.. చివర్లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫినిషింగ్‌కు స్కోరు అవలీలగా 200 దాటేసింది. ప్రతీ బంతిని బాదడమే లక్ష్యంగా ఈత్రయం క్రీజులో కదం తొక్కడంతో జెయింట్స్‌ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీనికితోడు ప్రత్యర్థి ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా ముంబైకి జత కలిసింది. ఓపెనర్‌ యాస్తిక (15) ఐదో ఓవర్‌లో వెనుదిరిగింది. ఇక ఐదు పరుగుల దగ్గర జీవనదానం లభించిన మాథ్యూస్‌ 8వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో బ్యాట్‌కు పనిజెప్పింది. 36 బంతుల్లోనే తను ఫిఫ్టీ పూర్తి చేయగా, సివర్‌ రెండు వరుస సిక్సర్లతో 29 బంతుల్లోనే ఈ ఫీట్‌ అందుకుంది. అలాగే 57 పరుగుల వద్ద మాథ్యూస్‌ రెండో క్యాచ్‌ను కూడా వదిలేశారు. ఈ చాన్స్‌తో తను 16వ ఓవర్‌లో వరుసగా 6,6,4తో 19 రన్స్‌ రాబట్టింది. తర్వాతి ఓవర్‌లోనే మాథ్యూ్‌సను కశ్వీ అవుట్‌ చేయగా, అప్పటికే రెండో వికెట్‌కు 71 బంతుల్లోనే 133 పరుగుల భాగస్వామ్యం జత చేరడం విశేషం. మరో ఎండ్‌లో హర్మన్‌ వచ్చీ రాగానే విరుచుకుపడింది. తనూజ ఓవర్‌లో 6,4,4,6తో ఏకంగా 22 రన్స్‌ సాధించింది. సివర్‌ 19వ ఓవర్‌లో వెనుదిరగ్గా, ఆఖరి ఓవర్‌లో హర్మన్‌ మరో రెండు సిక్సర్లతో 15 రన్స్‌ అందించి రనౌటైంది.


ముంబై ఇండియన్స్‌: 20 ఓవర్లలో 213/4. (సివర్‌ 77, హేలీ మాథ్యూస్‌ 77, హర్మన్‌ప్రీత్‌ 36; గిబ్సన్‌ 2/40) గుజరాత్‌ జెయింట్స్‌: 19.2 ఓవర్లలో 166 ఆలౌట్‌ (గిబ్సన్‌ 34, లిచ్‌ఫీల్డ్‌ 31, భారతి 30; మాథ్యూస్‌ 3/31, అమెలియా 2/28)

1

డబ్ల్యూపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్‌. ఓవరాల్‌గా లీగ్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు.

1

ఒకే సీజన్‌లో ఎక్కువ హాఫ్‌ సెంచరీలు (5) చేసిన ప్లేయర్‌గా సివర్‌ బ్రంట్‌

ఇవీ చదవండి:

రోహిత్‌పై ధోనీకి ఎందుకంత కోపం

సీఎస్‌కే క్రేజీ రికార్డ్

అబిద్‌ అలీ కన్నుమూత

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 04:07 AM