Building Collapse Claims Lives: కూలిన పాత భవనం. ముగ్గురు మృతి..
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:55 PM
80 ఏళ్ల పాత భవనం కుప్పకూలింది. ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. దినేష్ తన బైకుపై భవనం ముందున్న రోడ్డుపై వెళుతుండగా భవనం కుప్పకూలింది. శిథిలాలు అతడిపై పడి చనిపోయాడు.
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా పాత భవనాలు కూలుతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. సోమవారం గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పాత భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు బలయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెరావల్, ఖర్వావాడ్ ఏరియాలో 80 ఏళ్ల నాటి పురాతన భవనం ఉంది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో వర్షం కారణంగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
భవనం శిథిలాల కింద నలిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి, ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను 65 ఏళ్ల దేవకీ బెన్ సుయానీ, 35 ఏళ్ల జశోధ, 34 ఏళ్ల దినేష్ జుంగిగా గుర్తించారు.
మృతుడు దినేష్ తన బైకుపై భవనం ముందున్న రోడ్డుపై వెళుతుండగా భవనం కుప్పకూలింది. శిథిలాలు అతడిపై పడి చనిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాత భవనం మొత్తం నేలమట్టం అయిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇక, ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వర్షాకాలం వచ్చిందంటే పాత భవనాలు కూలటం సర్వసాధారణం’..‘ప్రభుత్వాలు పాత భవనాలు కూలగొట్టాలి. లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శరీరంలో విటమిన్ డి లోపం నివారించడానికి చిట్కాలు
రూ. 1500 కోసం హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..