Bihar: ఈ మ్యారేజ్ ఎంతో స్పెషల్.. చూస్తే అవాక్కవుతారు.!
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:02 PM
ఈ మధ్యకాలంలో అమ్మాయిని అమ్మాయి, అబ్బాయిని అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. వినడానికి, చూడ్డానికి ఇది వింతగానే అనిపించినా.. ఇలాంటి సంఘటనలు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో జరిగాయి. బీహార్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ (డేటింగ్ యాప్స్, ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్) ద్వారా కలుసుకున్న కొంతమంది తమ భావాలు, అభిరుచులు ఒకటే కావడంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. అబ్బాయిలు అబ్బాయిలను, అమ్మాయిలను అమ్మాయిలు ప్రేమించి వివాహమాడే సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే బీహార్లోని సుపాల్ జిల్లాలో చోటు చేసుకుంది.

సుపాల్ జిల్లాకు చెందిన పూజా గుప్తా(21), కాజల్ కుమారి(18) అనే ఇద్దరు యువతులకు రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. చాటింగ్, ఫోన్ కాల్స్తో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు త్రివేణిగంజ్ మేళా గ్రౌండ్లోని ఒక ఆలయానికి చేరుకున్నారు. వివాహ సమయంలో ఈ జంట ఒక చిన్న గ్యాస్ స్టవ్ వెలిగించి దాని చుట్టూ ఏడడుగులు వేశారు. వీరికి పెళ్లికి పూజారి, బంధువులు ఎవరూ లేరు.
పూజా గుప్తా వరుడి డ్రెస్ వేసుకోగా.. కాజల్ వధువు డ్రెస్ ధరించారు. పూజా తిలకంతో కాజల్, నుదుటిన తిలకం దిద్ది.. ఇరువురూ దండలు మార్చుకున్నారు. వివాహానంతరం ఇద్దరూ తమ రూముకు రావడంతో చుట్టు పక్కల వాళ్లు షాక్కు గురయ్యారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ.. తమకు అబ్బాయిలంటే ఇష్టం లేదని, శారీరక సంబంధాలపై ఆసక్తి లేదని అన్నారు. ఇద్దరం పూర్తి పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. చనిపోయే వరకు ఇద్దరం కలిసి ఉంటామని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేశామని తెలిపారు. ప్రస్తుతం.. వీరి వివాహానికి సంబంధించిన వార్త సుపాల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
