Amit Sehra: రాత్రికి రాత్రే మారిపోయిన అదృష్టం.. రూ.11 కోట్లు లాటరీ గెలుచుకొని..
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:43 AM
తన ఊళ్లో వెజిటబుల్స్ అమ్ముకుంటున్న ఓ పేద కూరగాయల వ్యాపారి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఒక్క రాత్రిలోనే ధనవంతుడిగా మారాడు. ఒక్క లాటరీ టికెట్ తనను పేదోడి నుంచి ఐశ్వర్యవంతుడిగా మార్చింది. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి సమాచారం మీకోసం..
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 9: రాజస్థాన్లోని కోట్పుత్లి ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా (32) చర్చనీయాంశంగా మారారు. సాధారణ జీవితాన్ని గడిపే అమిత్.. ఇటీవల పంజాబ్లో రూ.11 కోట్లు లాటరీ గెలుచుకున్నారు. దీంతో ఆయన దశ తిరిగింది. ఒక్కరాత్రిలోనే ధనవంతుడిగా మారడంతో ఆయన సంతోషానికి అవధులు లేవు. కోట్పుత్లిలో రోడ్డు చివరన అమిత్ సెహ్రా కూరగాయలు అమ్ముతుంటారు. అదే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఇటీవల ఆయన పంజాబ్లోని బఠిండా ప్రాంతంలో రూ.500కి లాటరీ టికెట్ (టికెట్ నంబర్ A438586) కొనుగోలు చేశారు. అక్టోబర్ 31 సాయంత్రం లూధియానాలో లాటరీ డ్రా జరిగింది. ఈ డ్రాలో మొదటి బహుమతిగా రూ.11 కోట్లు ప్రకటించగా, అమిత్ అదృష్టం మారిపోయింది.
లాటరీ టికెట్ కొనడానికి ఆయన తన స్నేహితుడు ముఖేష్ సేన్ దగ్గర నుంచి రూ.500 అప్పు తీసుకున్నారని చెప్పారు. గెలుపు ప్రకటించిన తర్వాత అమిత్ కుటుంబంతో కలిసి బఠిండాకు వెళ్లి లాటరీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిచేశారు. కొన్ని రోజుల తర్వాత కోట్పుత్లికి తిరిగి వచ్చినప్పుడు, ఆయనకు ఘన స్వాగతం లభించింది. బండ్లు, మిఠాయిలతో ఆయనను ఆహ్వానించారు. మొత్తం పల్లె ఆనందంలో మునిగిపోయింది.
ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. 'నా గెలుపులో నా స్నేహితుడు ముఖేష్ సేన్కి చాలా పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన వల్లనే నేను టికెట్ కొనగలిగాను. అందుకే ఆయన కుమార్తెలిద్దరికీ తలా 50 లక్షల చొప్పున ఒక కోటి రూపాయలు ఇస్తాను. వారు మంచి చదువులు చదవుకోని జీవితంలో ముందుకు సాగాలి. టికెట్ కొనుగోలు చేసినప్పుడు నా అదృష్టం ఇలా మారుతుందని నేను ఊహించలేదు. నా పిల్లల చదువుతో పాటు ఇతర పేద పిల్లల విద్య ఖర్చు కూడా నేను చూసుకుంటాను' అని చెప్పారు.
ఇక తన కష్టాలన్నీ పోయాయి అనుకోని హ్యాపీగా ఉందామనుకున్నాడు. లాటరీతో అమిత్ పేరు చర్చనీయాంశంగా మారడంతో మోసగాళ్ల దృష్టి కూడా ఆయనపై పడింది. అమిత్కి అనేక తెలియని నంబర్ల నుంచి కాల్స్, మెసేజ్లు రావడం ప్రారంభమైంది. కొందరు తమను లాటరీ కంపెనీ లేదా ప్రభుత్వ అధికారులు అని చెప్పి పన్ను, క్లెయిమ్ ఫీజు లేదా దానం పేరుతో డబ్బు అడుగుతున్నారు. కొందరు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అమిత్ తన మొబైల్ ఫోన్ను ఆఫ్ చేసి కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి:
ఎలుగుబంటికి గుండె ఆగినంత పనైంది.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టమే..
ఆఫీసులో రీల్స్ చేస్తూ ఎస్బీఐ మేనేజర్ వీడియో వైరల్