Employee Resign En masse: కంపెనీ సీఈఓకు ఊహించని షాకిచ్చిన ఉద్యోగులు
ABN , Publish Date - May 16 , 2025 | 10:48 PM
వర్క్ ఫ్రమ్ హోమ్ ముగిస్తున్నట్టు కంపెనీ సీఈఓ ప్రకటించడం నచ్చని ఉద్యోగులు అనేక మంది ఒక్కసారిగా సంస్థను వీడటంతో పెను కలకలం రేగింది. ఓ నెటిజన్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ముగింపు పలికేందుకు అనేక టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటూ తాము పనిచేసే సంస్థలను చిక్కుల్లో పడేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తాజా ఉదాహరణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జనాలు ఈ ఉదంతం చూసి షాకైపోతున్నారు.
ఓ నెటిజన్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. ఓ బడా ఫుడ్ డెలివరీ సంస్థ కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగులను నియమించుకున్నట్టు చెప్పారు. ఆఫీసుకు వచ్చే మరి కొందరు ఉద్యోగులకూ ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఈ విధానం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని భరోసా ఇచ్చింది. దీంతో, చాలా మంది తమ సొంత ప్రాంతాలకు, వేరే దేశాలకు కూడా వెళ్లిపోయారు. తమ తమ ప్రాంతాల నుంచే పని చేయడం ప్రారంభించారు.
ఇంతలో సంస్థలో ఉన్నతోద్యోగులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభంతో పాటే వర్క్ ఫ్రమ్ హోం శకం ముగిసిందన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో, ఉద్యోగులందరినీ ఆఫీసుకు రప్పించాలనుకున్నారు. ఇందుకు కుదరదన్న వారిని తొలగించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఉద్యోగులందరితో భారీ మీటింగ్ ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆఫీసుకు రాకుంటే ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు.
ఇది అధిక శాతం మందికి సుతారమూ నచ్చలేదు. దీంతో, కంపెనీ మీటింగులకు ఎగ్గొట్టడం ప్రారంభించారు. ఆ తరువాత అధిక శాతం మందికి ఉద్యోగానికి గుడ్బై చెప్పేశారు. ఒక్కసారిగా ఇంత మంది రాజీనామా చేయడంతో కంపెనీ దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. చివరకు కంపెనీలో క్యూసీ ఉద్యోగులతోనే కొన్నాళ్ల పాటు అవస్థ పడుతూ పని నెట్టుకొచ్చింది. నెటిజన్ షేర్ చేసిన ఈ ఉదంతం మొతన్ని చదివిన జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్బుక్ ఫొటో
ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు
నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు
ఐసీయూలో ఎయిర్హోస్టస్పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు