Plant Care Tips: మొక్కలు ఆరోగ్యంగా ఇలా
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:24 AM
మనం సాధారణంగా నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకుని కుండీల్లో నాటుకుంటూ ఉంటాం. మొదట బాగానే ఉన్నప్పటికీ క్రమంగా మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం చూస్తూ ఉంటాం. అలా జరగడానికి కారణాలతోపాటు...
మనం సాధారణంగా నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకుని కుండీల్లో నాటుకుంటూ ఉంటాం. మొదట బాగానే ఉన్నప్పటికీ క్రమంగా మొక్కలు వాడిపోవడం, ఎండిపోవడం చూస్తూ ఉంటాం. అలా జరగడానికి కారణాలతోపాటు మొక్కలను జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం...
వర్షాకాలంలో మొక్కలకు ఎక్కువగా తెగుళ్లు, చీడలు పడుతూ ఉంటాయి. అందుకే తరచూ మొక్కలను గమనిస్తూ ఉండాలి. ఆకుల మీద రంధ్రాలు, గుడ్లు, కొమ్మలపై పురుగులు, గూళ్లు కనిపిస్తే ఆ భాగాలను వెంటనే కత్తిరించాలి. నీళ్లలో వేప నూనె లేదా బేకింగ్ సోడా కలిపి పిచికారీ చేయాలి. మొక్కలకు బాగా ఎండ తగిలేలా చూసుకోవాలి.
మొక్క సరిగా ఎదగక పోయినా, ఆకులు వెంట వెంటనే పసుపు రంగులోకి మారిపోతున్నా తగిన పరిమాణంలో నైట్రోజన్ లభించడంలేదని అర్థం. వెంటనే మట్టిలో ఆవుపేడ, కాఫీ గింజలు, సేంద్రీయ ఎరువులు కలిపితే ప్రయోజనం ఉంటుంది. ఒక్కోసారి ఆకులు తెల్లగా మారుతుంటాయి. అలాంటప్పుడు కుండీలను ఎండలో పెడితే సమస్య తీరుతుంది.
నీరు సరిపోకపోతే ఆకులు ఎండిపోయి పెళుసుగా మారతాయి. మొక్కల స్వభావాన్ని బట్టి రోజూ కుండీల్లో నీళ్లు పోస్తూ ఉండాలి.
ఆకుల మధ్యలో ఉండే ఈనెలు పసుపు రంగులోకి మారితే మొక్కలకు మెగ్నీషియం, ఇతర పోషకాలు అందడంలేదని తెలుసుకోవాలి. అలాంటప్పుడు కుండీలో ఎప్సమ్ సాల్ట్ లేదా ఆలుగడ్డ పొట్టు, తేలికపాటి ఎరువులు కలిపితే సరిపోతుంది.
కొమ్మలు ఎండిపోతూ ఆకుల అంచులు గోధుమ రంగులోకి మారుతుంటే మొక్కలకు పోటాషియం కావాలని గుర్తించాలి. మొక్కల మొదట్లో అరటి పండు తొక్కలు, కోడి గుడ్డు పెంకులు వేసి మట్టిని కదుపుతూ ఉండాలి.
ఆకులు ఊదా రంగులోకి మారుతుంటే వేర్లు బలహీనమవుతున్నాయని తెలుసుకోవాలి. కోడిగుడ్డు పెంకులు, కూరగాయ తొక్కలను మట్టిలో కలుపుతూ ఉంటే మొక్కలు బలంగా పెరుగుతాయి.
ఇవీ చదవండి:
జీతంలో 50 శాతం పన్నులకే.. ఐరోపా లైఫ్పై ఎన్నారై పోస్టు వైరల్
22 ఏళ్ల వయసులో ఒంటరిగా విదేశీ యాత్ర.. ఈ భారతీయ యువకుడి అనుభవం ఏంటో తెలిస్తే..