Share News

Jacqueline Fernandez: నవయవ్వన సోయగం

ABN , Publish Date - May 10 , 2025 | 03:34 AM

విభిన్న సంస్కృతుల్లో పెరిగిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ బాలీవుడ్‌లో గ్లామర్‌ తారగా ఎదిగింది. ‘మిస్‌ శ్రీలంక’గా ప్రస్థానం మొదలుపెట్టి, వెండితెరపై అద్భుతమైన గుర్తింపు పొందింది.

 Jacqueline Fernandez: నవయవ్వన సోయగం

తారాజువ్వలా వెండితెర మీదకు దూసుకువచ్చింది. సల్మాన్‌ లాంటి స్టార్ల సరసన అందంగా ఒదిగిపోయింది. నవయవ్వన కాంతితో యువతరం హృదయ స్పందనై వెలిగింది. పరిశ్రమలోకి వచ్చి పదిహేనేళ్లు దాటినా... నేటికీ అదే మైమరిపించే రూపు... చూపు తిప్పుకోనివ్వని నాజూకు... జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.

స్వదేశం శ్రీలంక. పుట్టింది బహ్రైన్‌లో. డిగ్రీ... ఆస్ర్టేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయంలో. ఆమె తండ్రి ఎల్రాయ్‌ ఫెర్నాండెజ్‌ది శ్రీలంక. తల్లి కిమ్‌ది మలేషియా, కెనడా మూలాలున్న కుటుంబం. శ్రీలంకలో సింహళీస్‌, తమిళుల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో జాక్వెలిన్‌ తండ్రి దేశం వదిలి బహ్రైన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఎయిర్‌హోస్టె్‌సగా పని చేస్తున్న కిమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మధ్య పెరిగిన జాక్వెలిన్‌కు అక్క, ఇద్దరు అన్నలు. సిడ్నీ వర్సిటీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆమె... కొంతకాలం టీవీ రిపోర్టర్‌గా పని చేసింది. గ్లామర్‌ ప్రపంచంలోకి రావాలన్న ఆసక్తితో మోడలింగ్‌ మొదలుపెట్టింది. 2006లో ‘మిస్‌ యూనివర్స్‌ శ్రీలంక’ కిరీటాన్ని దక్కించుకుని, తన దేశం నుంచి ‘మిస్‌ యూనివర్స్‌’కు పోటీపడింది.

అలా వచ్చి...

మూడేళ్ల తరువాత ఓ మోడలింగ్‌ ప్రాజెక్ట్‌ కోసం భారత్‌కు వచ్చిన జాక్వెలిన్‌... అదే సమయంలో నిర్వహించిన ‘అలాదిన్‌’ చిత్రం ఆడిషన్స్‌కు వెళ్లింది. దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ను ఆమె రూపం ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి జాక్వెలిన్‌కు భారత్‌ మరో ఇల్లు అయింది. అలా 2009లో నటిగా తొలి అడుగు వేసిన జాక్వెలిన్‌... మహే్‌షభట్‌ ‘మర్డర్‌2’తో మొదటి హిట్‌ అందుకుంది. సల్మాన్‌ఖాన్‌ సరసన తెలుగు చిత్రం ‘కిక్‌’ రీమేక్‌లో నటించింది. ఆమె కెరీర్‌లోనే భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమా అది. తెలుగు, కన్నడల్లో పలు ప్రత్యేక గీతాల్లో మెరిసిన జాక్వెలిన్‌... ఈ పదిహేనేళ్లలో 35కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతులో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. నటి కావాలన్నది చిన్ననాటి కోరిక. హాలీవుడ్‌ తారగా వెలిగిపోవాలని కలలు కనేదట. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న ఆమె జీవితాన్ని 2021లో మనీ లాండరింగ్‌ కేసు కుదిపేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్‌ చంద్రశేఖర్‌ నుంచి ఖరీదైన బహుమతులు అందుకుందన్నది జాక్వెలిన్‌పై ఆరోపణ. ఇది ఆమె కెరీర్‌నే కాదు, జీవితాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసింది. కానీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా తిరిగి నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ఒత్తిడుల నుంచి తనను రక్షిస్తున్నది, ఆరోగ్యంగా ఉంచుతున్నది ఫిట్‌నెస్‌ అంటుంది జాక్వెలిన్‌.


ఆదివారమూ విరామం లేదు...

ఇతర తారలకు భిన్నంగా... జాక్వెలిన్‌ రోజూ కంటే ఆదివారం వ్యాయామాల కోసం మరింత ఎక్కువ సమయం కేటాయిస్తుందిట. ‘‘యోగా, వెయిట్‌ ట్రైనింగ్‌, డ్యాన్స్‌లు కలగలిపి ఆదివారం నా వర్కవుట్‌ రెండు నుంచి మూడు గంటలపాటు తీవ్రంగా సాగుతుంది. కొంతమంది అంటుంటారు... ‘నాక్కూడా నీలాంటి దృఢమైన ఆకృతి కావాల’ని. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. కొన్నేళ్లుగా ఇదే రూపాన్ని కాపాడుకొంటూ వస్తున్నా. క్రమం తప్పని ఆహార నియమాలు పాటిస్తున్నా. నా రూపు అథ్లెట్లను తలపించాలని కోరుకొంటాను. ఎప్పుడూ దృఢంగా, ఉల్లాసంగా, చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తాను. అవసరమైనప్పుడు కావల్సినంత విశ్రాంతి తీసుకొంటాను’’ అంటున్న ఈ ముద్దుగుమ్మ తరచూ తన ఫిట్‌నెస్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి, అభిమానులకు ప్రేరణ కలిగిస్తుంటుంది. ఇన్‌స్టాలో ఏడు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారంటే ఆమె క్రేజ్‌ ఏస్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు.

జాక్వెలిన్‌ వ్యాయామాల్లో ప్రధానంగా యోగ ఉంటుంది.

ఉదయం లేవగానే జాగింగ్‌, రన్నింగ్‌తో కూడిన కార్డియో


తరువాత యోగా, పిలెట్స్‌, స్ర్టెంత్‌ ట్రైనింగ్‌

రోజూ ఒకటే రకం వర్కవుట్స్‌తో ఆసక్తి తగ్గుతుంది. అందుకని తనను తాను ఉత్సాహపరుచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొంటుంది.

వ్యాయామాలను ఉత్సాహభరితంగా మార్చేందుకు పోల్‌డ్యాన్స్‌, ఏరియల్‌ సిల్క్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తుంది. పోల్‌ డ్యాన్స్‌ తనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపిందో, శరీరాన్ని మరింత దృఢంగా ఎలా మార్చిందో వివరిస్తూ ఆ మధ్య ఇన్‌స్టాలో ఒకపోస్టు పెట్టింది జాక్వెలిన్‌.

తెల్లవారుజామును ఐదు గంటలకే జాక్వెలిన్‌ దినచర్య మొదలవుతుంది.

ఉదయం లేవగానే తేనె, నిమ్మ రసం కలిపిన గ్లాసుడు గోరువెచ్చని నీరు

బ్రేక్‌ఫా్‌స్టలో ఉడకబెట్టిన గుడ్లు, తాజా పండ్లు, గ్రీన్‌ టీ.

మధ్యాహ్న భోజనంలో పప్పుతో బ్రౌన్‌ రైస్‌, వెజిటబుల్‌, ఫ్రూట్‌ సలాద్‌లు. వీటితోపాటు పిండి, పీచు పదార్థాలు, పోషక విలువలు పుష్కలంగా ఉండే క్వినోవా ఆమె మెనూలో తప్పనిసరి.

అలాగే సలాద్‌లు, వంటల్లో రెడ్‌, యల్లో క్యాప్సికమ్‌, చిలకడదుంపలు చేరతాయి.

ఇంటర్మిటెన్‌ ఫాస్టింగ్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. తీపి పదార్థాలకు దూరంగా ఉంటుంది.

రాత్రిపూట తేలికపాటి భోజనం. సాధ్యమైనంతవరకు రాత్రి ఏడు గంటలకల్లా డిన్నర్‌ ముగిస్తుంది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 03:34 AM