Share News

Tati Munjalu: తాటి ముంజలతో మురిపించే రుచులు

ABN , Publish Date - May 10 , 2025 | 03:56 AM

తాటి ముంజలు వేసవిలో తేలికపాటి, చల్లదనాన్ని ఇచ్చే ఆహారంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి తినడం మాత్రమే కాకుండా, రుచికరమైన వంటల్లో కూడా వినియోగించవచ్చు.

Tati Munjalu: తాటి ముంజలతో మురిపించే రుచులు

మనలో చాలామంది తాటి ముంజలను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటితో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. తాటి ముంజలను సరికొత్తగా ఆస్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...

gfj.jpg

తాటి ముంజలతో లెమనేడ్‌

కావాల్సిన పదార్థాలు

తాటి ముంజలు- నాలుగు, నిమ్మరసం- రెండు చెంచాలు, పంచదార- మూడు చెంచాలు, ఐస్‌ క్యూబ్స్‌- 4, ఉప్పు- చిటికెడు, నల్ల ఉప్పు- చిటికెడు, నీళ్లలో నానబెట్టిన సబ్జాగింజలు- రెండు చెంచాలు, పుదీనా ఆకులు రెండు

తయారీ విధానం

తాటి ముంజలను చిన్న ముక్కలుగా తరగాలి.

మిక్సీలో తాటి ముంజల ముక్కల్లో సగం, నిమ్మరసం, పంచదార, రెండు ఐస్‌ క్యూబ్‌లు, ఉప్పు, నల్ల ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి.

ఒక సర్వింగ్‌ గ్లాస్‌లో సబ్జాగింజలు, మిగిలిన తాటి ముంజల ముక్కలు, రెండు ఐస్‌ క్యూబ్‌లు, మిక్సీ గిన్నెలోని మిశ్రమం వేయాలి. ఒక గ్లాసు చల్లని నీళ్లు పోయాలి. పైన పుదీనా ఆకులు వేసి సర్వ్‌ చేయాలి.

జాగ్రత్తలు

లేత తాటి ముంజలు తీసుకుంటే ఈ పానీయం మరింత రుచిగా ఉంటుంది.

ఇందులో నానబెట్టిన చియా గింజలు కూడా వేసుకోవచ్చు.

వీటిలో నీరు అధికంగా ఉంటుంది కాబట్టి శరీరానికి తగినంత తేమ అందుతుంది. నిర్జలీకరణ సమస్యలు రావు. తాటి ముంజలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.


fgk.jpg

తాటి ముంజల పాయసం

కావాల్సిన పదార్థాలు

పాలు- ఒక లీటరు, పంచదార- ముప్పావు కప్పు, లేత తాటి ముంజలు- ఆరు, యాలకుల పొడి- అర చెంచా, బాదం పలుకులు- రెండు చెంచాలు, జీడిపప్పు పలుకులు- రెండు చెంచాలు, గులాబీ నీరు- ఒక చెంచా

తయారీ విధానం

తాటి ముంజలకు తొక్క తీసి వీలైనంత సన్నగా తరగాలి.

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి పాలు పోసి పెద్ద మంట మీద పావుగంటసేపు మరిగించాలి. పాలను గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కగా అయ్యాక పంచదార పోసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత పాలను స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచాలి. తరవాత ఈ చల్లటి పాలలో తాటి ముంజల తరుగు, గులాబీ నీళ్లు, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తరవాత చిన్న పింగాణీ గిన్నెల్లో పోసి సర్వ్‌ చేయడమే. ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది.

జాగ్రత్తలు

పాయసం చిక్కగా ఉండాలనుకుంటే... చిన్న గిన్నెలో ఒక చెంచా కస్టర్డ్‌ పౌడర్‌ వేసి, కొన్ని నీళ్లు పోయాలి. జారుగా కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో కలిపితే సరిపోతుంది.

గులాబీ నీరు అందుబాటులో లేకపోతే నాలుగు రేకుల కుంకుమ పువ్వు వేసుకోవచ్చు.

పంచదార వద్దనుకుంటే... మరిగిన పాలను స్టవ్‌ మీద నుంచి దించాక అందులో బెల్లం పొడి కలుపుకోవచ్చు.

తాటి ముంజలలో ఎ, బి, సి విటమిన్లతోపాటు ఐరన్‌, జింక్‌, ఫాస్పరస్‌, పొటాషియం లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటు, మలబద్దకం లాంటి సమస్యలను నివారిస్తాయి. శరీరంలో కణితులు, రొమ్ము క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తాయి. ముఖం మీద మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా చేస్తాయి.


ghl.jpg

తాటి ముంజల కూర

కావాల్సిన పదార్థాలు

తాటి ముంజలు- నాలుగు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు- అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ఉప్పు- తగినంత, కారం- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, ధనియాల పొడి- అర చెంచా, జీలకర్ర- పావు చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, కొత్తిమీర తరుగు- పావు కప్పు, నూనె- మూడు చెంచాలు

తయారీ విధానం

తాటి ముంజలకు తొక్క తీసి ఒక్కోదాన్ని నాలుగు ముక్కలుగా కోయాలి.

స్టవ్‌ మీద కడాయి పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. తరవాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత తాటి ముంజల ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత టమాటా ముక్కలు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరవాత కడాయిని స్టవ్‌ మీద నుంచి దించి కూరను వేరే గిన్నెలోకి తీయాలి. ఈ తాటి ముంజల కూర... అన్నం, చపాతీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.

జాగ్రత్తలు

తాటి ముంజల్ని మరీ లేతగా, మరీ ముదురుగా కాకుండా మధ్యస్థంగా ఉండేవి తీసుకోవాలి.

నూనె వేడెక్కిన వెంటనే కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తే కూర కమ్మగా ఉంటుంది.

టమాటా ముక్కలను వీలైనంత సన్నగా తరగాలి. లేదంటే టమాటా పేస్టు వాడుకోవచ్చు.

ఎండాకాలంలో తాటి ముంజలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. వడదెబ్బ తగలదు. శరీరంలో పేరుకున్న విషపదార్థాలు తొలగిపో తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 03:56 AM