Final Goodbye to Tejas Pilot: కన్నీటితో ఆ పైలట్కు అంతిమ వీడ్కోలు పలికిన భార్య..
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:06 PM
దుబాయ్ ఎయిర్ షోలో ఫ్లైట్ కూలిపోవడంతో మృతిచెందిన పైలట్కు ఆయన భార్య కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సైనికుల గౌరవ వందనాల నడుమ ఆయన అంత్యక్రియలు నిర్వహించింది ఐఎఎఫ్.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ ఎయిర్ షో(Dubai Air Show)లో తేజస్ ప్రమాదంలో మృతిచెందిన పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్(Wing Commander Namansh Syal) మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్లోని ఆయన స్వగ్రామమైన కాంగ్రా(Kangra)లోని పాటియాల్కర్ ప్రాంతానికి తరలించారు. ఆయన భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్.. ఆయనకు తుది వీడ్కోలు పలికారు(Air Force Officer's Final Goodbye To Husband). ఈ సందర్భంలో ఆమె కన్నీటిపర్యంతమవుతూనే భర్తకు సెల్యూట్ చేశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సైన్యం గౌరవ వందనాల నడుమ ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మృతిచెందిన పైలట్, వింగ్ కమాండర్ భార్య అఫ్షాన్(Air Force Officer Afshan) కూడా అదే విభాగానికి చెందిన వారే. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. భర్త అకాల మృతితో ఆమె విషాదంలో మునిగిపోయారు. కన్నీళ్లను దిగమింగుకుంటూనే భర్త మృతదేహానికి చివరిసారి సెల్యూట్ చేశారు. అయినప్పటికీ ఆమె రోదిస్తుండగానే సహచరులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.
పైలట్ కమాండర్ సియాల్ మృతిపట్ల భారత వైమానిక దళం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి ప్రొఫెషనల్ అయిన వింగ్ కమాండర్ సియాల్.. అంకితభావం, నిబద్ధత, అసాధారణ నైపుణ్యం, అలుపెరుగని దృఢ సంకల్పంతో దేశానికి సేవ చేశారని కొనియాడింది. 'సేవకు అంకితమైన ఆయన జీవితం.. నేడు ఆయనకు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టింది. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి ఐఏఎఫ్(Indian Air Force) సంఘీభావంగా నిలుస్తుంది' అని పేర్కొంది. ఈ కార్యక్రమానికి ఐఏఎఫ్ సిబ్బంది సహా యూఏఈ అధికారులు(UAE officials), భారత రాయబార కార్యాలయ అధికారులు(Indian Embassy), సహచరులు తదితరులు హాజరయ్యారు.
వింగ్ కమాండర్ నమాన్ష్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్(CM Sukhvinder Singh) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్ ఓ ధైర్య పుత్రుడిని కోల్పోయిందని ఆయన అన్నారు.
ఇవీ చదవండి: