Wild Bear: కశ్మీర్ రిసార్ట్లో ఎలుగుబంటి కలకలం
ABN , Publish Date - Jun 27 , 2025 | 07:58 AM
కశ్మీర్లోని సోన్మార్గ్లోని ఓ రిసార్ట్లో ఎలుగుబంటి ప్రవేశించడం కలకలం రేపింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్లో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. గాందర్బల్ జిల్లా సోనామార్గ్లోని ఓ రిసార్ట్ వద్ద ఎలుగుబంటి సంచరించడం చూసి జనాలు హడలెత్తిపోయారు. స్థానికులు కొందరు దాన్ని అక్కడి నుంచి తరిమేశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని బంధించి జనావాసాలకు దూరంగా మరో చోట వదిలిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
సోనామార్గ్లో స్థానికులు చెత్తాచెదారాన్ని ఇష్టారీతిన పడేయడంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొంత కాలం క్రితం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీరుతో ఎలుగుబంట్లకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఈ విషయంలో నిబంధనల అమలును పట్టించుకోని సోనామార్గ్ డెవలప్మెంట్ అథారిటీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో పారేసే చెత్త కారణంగా ఎలుగుబంట్లు ఇక్కట్ల పాలవుతున్నాయని వెల్లడించింది.
సోనామార్గ్లో రిసార్టులు, గెస్టు హౌస్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్మాణం ఎక్కువకావడంతో ఎలుగుబంట్ల నివాస ప్రాంతాలు తరిగిపోతున్నాయని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. జనావాసాలు విస్తరించి అటవీ ప్రాంతం కుంచించుకుపోతోందని వెల్లడించింది. ఒకప్పుడు అడవి జంతువులకు పరిమితమైన ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
పాక్కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు
విమానాన్ని కూల్చేస్తా.. ఎయిర్ ఇండియా సిబ్బందికి మహిళా డాక్టర్ బెదిరింపులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి