PM Modi: వికసిత్ తమిళనాడును నిర్మిస్తాం.. రూ.4,900 కోట్లతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Jul 26 , 2025 | 09:43 PM
ఇటీవల బ్రిటన్లో తాను పర్యటించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, తన పర్యటనలో భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఇది ప్రపంచ దేశాలకు భారత్పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు.
తూతుకూడి: వికసిత్ తమిళనాడు, వికసిత్ భారత్ నిర్మాణానికి తాము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. తమిళనాడు (Tamilnadu)లోని తూతుకూడిలో రూ.4,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శనివారంనాడు శంకుస్థాపనతో పాటు, కొన్నింటిని జాతికి ప్రధానమంత్రి అంకితం చేశారు. తూతుకూడి ఎయిర్పోర్ట్లో కొత్తగా నిర్మించిన టెర్మనల్ను ప్రారంభించారు. తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తేనారాసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.గీతా జీవన్, లోక్సభ ఎంపీ కనిమొళి, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్గిల్ విజయ్ దివస్ను గుర్తుచేసుకుంటూ కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఇటీవల బ్రిటన్లో తాను పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తన పర్యటనలో భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఇది ప్రపంచ దేశాలకు భారత్పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. అదే పట్టుదలతో వికసిత తమిళనాడు, వికసిత భారత్కు కట్టుబడి ఉన్నామని చెప్పారు. లార్డ్ రామేశ్వర్, తిరుచెందూర్ మురుగన్ ఆశీస్సులతో ఈరోజు తూతుకుడిలో నూతన అభివృద్ధి అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.
మౌలిక వసతుల కల్పన, ఇంధనం అనేవి ఏ రాష్ట్ర అభివృద్ధికైనా కీలకమని, గత 11 ఏళ్లుగా ఈ రెండు రంగాల్లో తమిళనాడు అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని ప్రధాని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భారత సైన్యంలోకి ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్... రుద్ర
నితీష్కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా... కేంద్ర మంత్రి నిప్పులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి