CM Stalin: తమిళనాట ద్విభాషా విద్యా విధానమే
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:44 AM
తమిళనాడులో ద్విభాషా విద్యా విధానాన్నే కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. స్పోకెన్ ఇంగ్లీష్ తరహాలో స్పోకెన్ తమిళంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని పేర్కొన్నారు.
స్పోకెన్ ఇంగ్లీష్ తరహాలో స్పోకెన్ తమిళం
కేంద్ర ప్రభుత్వ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా సొంత విధానాన్ని ప్రకటించిన సీఎం స్టాలిన్
విద్యను మునుపటిలా రాష్ట్ర జాబితాలో చేర్చాలని..
నీట్ పరీక్షలు రద్దుకు కేంద్రాన్ని కోరతామని వెల్లడి
చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ద్విభాషా విద్యా విధానాన్నే కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. స్పోకెన్ ఇంగ్లీష్ తరహాలో స్పోకెన్ తమిళంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీఎంకే ప్రభుత్వం.. దానికి ప్రత్యామ్నాయంగా రిటైర్ట్ జడ్జి డి. మురుగేశన్ నాయకత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీతో నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఆ విద్యావిధానాన్ని శుక్రవారం ఉదయం చెన్నైలో నిర్వహించిన సభలో సీఎం విడుదల చేశారు. ఈ విద్యావిధానంలోని ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో ద్విభాషా విద్యావిధానాన్నే కొనసాగించనున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు.
విద్యను మునుపటిలా రాష్ట్ర జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే, తమ నూతన విద్యా విధానం ప్రకారం నీట్ పరీక్షలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. అదే సమయంలో నీట్ పరీక్షల కోసం శిక్షణ సంస్థలు చేస్తున్న అసత్య ప్రచారాలపై నిషేధం విధించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తమిళనాట ప్లస్-1 (11వ తరగతి) పబ్లిక్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. అలాగే, సీబీఎ్సఈ, స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలల్లో విపరీతంగా పెంచుతున్న ఫీజులను క్రమబద్ధీకరించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎంజీఆర్, అన్నా, తమిళ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నూతన విద్యావిధానంలో ప్రతిపాదించినట్టు స్టాలిన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News