CAG Report: రెండున్నర రెట్లు పెరిగిన ఖర్చు
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:56 AM
దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడంపై కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన...
జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతం
వీటిపై పదేళ్లలో భారీగా పెరిగిన వ్యయం
మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం
వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం
కాగ్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడంపై కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి 28 రాష్ట్రాల అప్పులు రూ.17.57 లక్షల కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ.59.60 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది. దీంతో పాటుగా అప్పులు, రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపై కాగ్ తాజా నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు, పింఛన్లు, రుణాల వడ్డీల చెల్లింపులపై అధిక భాగం వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా పదేళ్లలో 2.49 రెట్లు పెరిగిందనితెలిపింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.26 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 అది ఏకంగా 15.63 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది. ఈ మొత్తం రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు సగమని తెలిపింది. ఇంకా సబ్సిడీలు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లను కలిపితే.. రాష్ట్రాలు చేసే వ్యయంలో ప్రతి రూపాయిలో ఐదింటిలో నాలుగుకు పైగా వంతు వాటికే పోతోందని వివరించింది. జీతాలు, పెన్షన్లు, ప్రభుత్వ అప్పులపై వడ్డీ చెల్లింపులను ‘నిబద్ధ వ్యయం’గా పరిగణిస్తారు. 2013-14, 2022-23 మధ్య రాష్ట్రాల మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం స్థిరంగా 80-87 శాతం నడుమ ఉంటోంది. రాష్ట్రాల మొత్తం జీఎస్డీపీలో ఆ వాటా 13-15 శాతం మధ్య ఉంది. 2022-23 ఆర్థిక ఏడాది వరకు చూస్తే.. రెవెన్యూ వ్యయం రూ.35.96 లక్షల కోట్లుగా ఉంది. ఇది మొత్తం వ్యయంలో 85 శాతం, మొత్తం జీఎస్డీపీలో 13.85 శాతం. 2022-23లో మొత్తం రెవెన్యూ వ్యయంలో వేతనాలు, పింఛన్లు, రుణాలకు వడ్డీ వంటి వాటికి రూ.15.63 లక్షల కోట్లు ఖర్చు చేయగా, సబ్సిడీలు రూ.3.09 లక్షల కోట్లకు చేరాయి. అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లు రూ.11.26 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ మూడింటిని కలిపితే మొత్తం రెవెన్యూ వ్యయంలో 83 శాతంగా తేలింది. దీని వలన అభివృద్ధి, మూలధన వ్యయం కోసం తక్కువ వెసులుబాటు ఉంటోందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.
రెవెన్యూ లోటులో పలు రాష్ట్రాలు
2022-23లో 17రాష్ట్రాలు రెవెన్యూ మిగులు లక్ష్యం పెట్టుకోగా.. 12 రాష్ట్రాలు ఆ టార్గెట్ను చేరుకున్నాయి. అసోం, బిహార్, హిమాచల్ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్లు రెవెన్యూ లోటుతో ముగిశాయి. రెవెన్యూ లోటును తగ్గించుకోవాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్ లక్ష్యంగా పెట్టుకోగా.. వీటిల్లో కర్ణాటక రెవెన్యూ మిగులులోకి వెళ్లగా.. మహరాష్ట్ర మాత్రమే పెట్టుకున్న లక్ష్య పరిమితికి తగ్గించుకుంది. 2022-23లో రెవెన్యూ లోటులో ఉన్న 12 రాష్ట్రాలకుగానూ ఏపీ సహా తొమ్మది రాష్ట్రాలు మాత్రమే ఆర్థిక సంఘం నుంచి రెవెన్యూ లోటుకు సంబంధించిన గ్రాంట్లు పొందాయి.
ఎక్కువ రాష్ట్రాల్లో జీతాలపై ఖర్చే టాప్
2013-14 నుంచి 2022-23 మధ్య రెవెన్యూ వ్యయం 2.66 రెట్లు పెరిగింది. చాలా వరకు రాష్ట్రాల్లో ‘నిబద్ధ వ్యయం’లో వేతనాలపై అధికంగా ఖర్చు చేస్తుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో పింఛన్లు, వడ్డీ చెల్లింపులు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్లలో పింఛన్ల కంటే వడ్డీ చెల్లింపులు అధికంగా ఉన్నాయు. 2013-14, 2021-22 మధ్య తొమ్మిది సంవత్సరాల కాలంలో వ్యయంలో వేతనాల తర్వాత వడ్డీలు స్థిరంగా రెండో స్థానంలో ఉంది. మరోవైపు సబ్సిడీలపై వ్యయం వేగంగా 3.21 రెట్లకు పెరిగిందని కాగ్ తెలిపింది. 2013-14లో రాష్ట్రాల మొత్తంగా రూ.96,479 కోట్లు ఉండగా.. 2022-23 నాటికి అవి రూ.3.09 లక్షల కోట్లకు చేరాయని వివరించింది.
ఇవి కూడా చదవండి..
జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత... శరవేగంగా వృద్ధి
దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్.. ఇక జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి