Supreme Court: జస్టిస్ గవాయ్ ‘పరాన్నజీవుల’ వ్యాఖ్య నిరుపేదలపై కాఠిన్యానికి నిదర్శనం
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:29 AM
‘‘ఉచిత’ పథకాల ద్వారా ఒక పరాన్నజీవుల వర్గాన్ని సృష్టించట్లేదూ’ అని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలను 300 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు ఒక బహిరంగ లేఖలో ఖండించారు.
300 మందికి పైగా సామాజిక కార్యకర్తల బహిరంగ లేఖ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ‘‘ఉచిత’ పథకాల ద్వారా ఒక పరాన్నజీవుల వర్గాన్ని సృష్టించట్లేదూ’ అని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలను 300 మందికి పైగా సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు ఒక బహిరంగ లేఖలో ఖండించారు. ఢిల్లీలో ఇళ్లులేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు పేదల పట్ల న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యతిరేకతను ప్రతిఫలిస్తున్నాయని ఆ లేఖ విమర్శించింది. ‘ఇళ్లు లేని వారంటే పట్టణ పేదల్లో అతిపేదలు.
భవన నిర్మాణ కూలీలుగా, పారిశుధ్య కార్మికులుగా, బరువులు మోయడం వంటి కష్టమైన పనులు చేసుకుని జీవిస్తుంటారు. అలాంటి వారిని పరాన్నజీవులుగా వ్యాఖ్యానించడం కాఠిన్యతకు నిదర్శనమ’ని పేర్కొంది. అత్యంత బలహీన వర్గాలపై నిందలు వేయడం, వారిని వెక్కిరించడం తగదని సూచించింది.